సారాంశం

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో  మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులు ఇవాళ సమావేశమయ్యారు. ఎన్నికల సభలు, ఇతర వ్యూహాలపై చర్చిస్తున్నారు.

హైదరాబాద్:ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు గురువారం నాడు భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో,  ఎన్నికల ప్రచారం, పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల ప్రకటనపై  చర్చిస్తున్నారని సమాచారం.

ఈ నెల 9వ తేదీన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఎన్నికల సంఘం  షెడ్యూల్ ను విడుదల చేసింది.  దీంతో  ఎన్నికల ప్రచారంపై  బీఆర్ఎస్ కేంద్రీకరించింది.ఈ నెల  15న  అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అదే రోజున అభ్యర్థులకు  బీ ఫారాలు అందించనున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో‌ను కూడ ఆ పార్టీ విడుదల చేయనుంది.

రాష్ట్రంలోని పలువురు అధికారులను బదిలీ చేయాలని ఈసీ నిన్న ఆదేశాలు  జారీ చేసింది.  ఈ విషయాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.ఈ నెల  15 నుండి  ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుండి  సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.  సుమారు 41 ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పక్కా ప్లాన్‌తో కమల దళం,అసెంబ్లీకో ఇంచార్జీ

మరో వైపు  నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో  అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా  ఆయా స్థానాల్లో  ప్రచారం చేసుకోవాలని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకత్వం  తేల్చి చెప్పింది. మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి,నాంపల్లి -ఆనంద్ గౌడ్,గోషామహల్- గోవింద్ రాటే, జనగామ -పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి లను బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది.  

అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టేలా  ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ తో  మంత్రులు చర్చిస్తున్నారని సమాచారం.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో  హరీష్ రావు, కేటీఆర్ లు విస్తృతంగా పర్యటిస్తున్నారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  అనారోగ్యానికి గురైన కేసీఆర్ కోలుకున్నారు.  పార్టీ నేతలతో  చర్చిస్తున్నారు. ఎన్నికల సర్వే రిపోర్టులపై చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు  క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు  అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.