తెలంగాణకు నిధులివ్వరు.. ఇక్కడ పోటీ చేస్తారా, మోడీని ఓడించి తీరుతాం : మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మోడీ తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారని,రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ప్రధాని మోడీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారని,రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు.తెలంగాణలో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని.. కరోనా సమయంలో కూడా రైతు బంధును ఆపలేదని మంత్రి చెప్పారు. దేశంలో నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్దేనని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు కార్యక్రమం కింద నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతోందని ఆయన చెప్పారు.
అంతకుముందు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల పనులను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని అధికారులను సూచించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం), తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పనులపై శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్లో నిర్వహించిన నెలవారీ సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్రావు ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రజా ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.
ALso REad: కర్ణాటక నుండే బిఆర్ఎస్ అడుగులు... స్వయంగా రంగంలోకి కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జంగం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా తరగతులు ప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతుల ప్రారంభానికి సంబంధించిన అన్ని పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలనీ, జాతీయ వైద్య మండలి తనిఖీ బృందం వచ్చేలోపు కళాశాలలు సిద్ధంగా ఉండాలని హరీశ్రావు ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్త్రీ, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణ పనులను కూడా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రులకు మందుల సరఫరాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి.. ప్రతి ఆసుపత్రి మూడు నెలల పాటు మందుల బఫర్ స్టాక్ను నిర్వహించాలి అని సంబంధిత అధికారులకు హరీశ్ రావు ఆదేశాలిచ్చారు.