మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరి అవతారమెత్తారు. మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 15 మందికి గొర్రె పిల్లలను పంపిణీ చేశారు.
తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. తాజాగా ఆయన గొర్రెల కాపరి అవతారం ఎత్తాడు.
మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 15 మందికి గొర్రె పిల్లలను పంపిణీ చేశారు. ఈ తంతు ముగిసిన అనంతరం మల్లన్న గొర్రెల కాపరి వేషధారణలో యాదవుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా వుంటుందని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.
ALso Read: యాటకూర తిన్నాకా.. తోటకూర తినగలమా, మల్లారెడ్డి మాట్లాడక నేను మాట్లాడినా అంతే : కేటీఆర్
ఇకపోతే.. మంత్రి మల్లారెడ్డిపై అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఇటీవల అడ్డాకుల మండలం వేముల-పొన్నకల్ గ్రామ శివారులో యస్జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్ కు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మల్లారెడ్డి మాట్లాడాక నేను మాట్లాడితే యాటకూర తిన్నాక, తోటకూర తిన్నట్లు వుంటుందన్నారు. దేవరకద్ర ప్రాంతంలో 2014లో కేవలం 40 వేల ఎకరాల భూమికి సాగునీరు అందేదని, ఇప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఆ పార్టీ వాళ్లు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు వస్తారని, మోసపూరిత మాటలు చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలు వస్తే పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని.. ప్రైవేట్ యాజమాన్యాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు.
