Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త...అతి త్వరలో భారీ ఉద్యోగాల భర్తీ

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో కలిసి పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు సమీక్ష చేపట్టారు. 

minister ktr review meeting on combined medak dist municipalities
Author
Siddipet, First Published Jul 10, 2020, 8:15 PM IST

సిద్దిపేట: అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఈ మేరకు నియామక ప్రక్రియను పూర్తిచేసి మున్సిపాలీటిల్లో పాలనను మరింత మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో కలిసి పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు సమీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి సాయింత్రం నాలుగు  గంటల వరకు సమీక్షా సమావేశం సాగింది.  

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీ అని... దీన్ని నమూనాగా తీసుకుని ఇతర మున్సిపాలిటీలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. 

''ప్రస్తుతం  ఎలాంటి ఎన్నికలు లేవు. మూడున్నరేళ్లు ప్రశాంతంగా ప్రణాలికాబద్దంగా అభివృద్ధి పనుల్లో నిమగ్నమవ్వాలి. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42  అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఓ అభివృద్ధి నమూనా పట్టిక తయారు చేశాం. అందులో  ఆదర్శ మున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన అభివృద్ధి, అవసరమైన పనులు, హంగులు ఉన్నాయి. వీటిని మున్సిపల్ కమీషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు అంద జేస్తాం. 42 అంశాల్లో మీ మున్సిపాలిటీలో ఏమి ఉన్నాయి... ఏవి లేవు అన్నవి మీరు చెక్ చేసుకోండి'' అని సూచించారు. 

read more    16 మంది సీఎంలకు అది సాధ్యం కాలేదనే... కేసీఆర్ ఈ ప్రయత్నాలు: రేవంత్ ఫైర్

''మరో మూడున్నరేళ్లలో అభివృద్ధి పట్టికలో ఏ స్థానంలోకి తీసుకెళ్లాలి, ఏ పనులు ప్రాదాన్యత క్రమంలో  చేపట్టాలి అనే ప్రణాళికను లక్ష్యంగా నిర్ణయించుకోండి. డంప్ యార్డు ఉందా, ఆన్ లైన్లో బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తున్నామా లేదా,  ప్రజలకు తాగు నీరు ఎలా అందుతుంది... అనే అంశాలు ఈ 42 అంశాలున్న జాబితాలో ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ స్టేట్ అని చెబుతుంటారు. ఆయన ఆలోచన విధానంలో భాగంగా మన టౌన్ అభివృద్ధిని మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకు అనుగుణంగా పని చేయాలి'' అని అన్నారు.

''ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులను మున్సిపాలిటీలకు ఠంఛనుగా ఇస్తోంది. మీరు చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేయండి. మెదక్, సంగారెడ్డి మున్సిపాలిటీలు జిల్లా కేంద్రాలు కూడా. ఇవి అన్ని రంగాల్లో సమగ్ర రీతిలో అభివృద్ధి చెందాలి. రిసోర్సెస్  ఆడిట్, పవర్ ఆడిట్, శానిటైజ్ ఆడిట్, వాటర్ ఆడిట్ లను అన్ని మున్సిపాల్టీలు చేపట్టాలి. రిసోర్సెస్ ఆడిట్ లో భాగంగా మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలపై అవగాహన పెంచుకోండి. ఆదాయ వనరులు ఎలా పెంచాలి అన్న అంశంపై దృష్టి సారించాలి. ఇందు కోసం కొత్త మార్గాలు అన్వేషించాలి'' అని ఆదేశించారు. 

'' పవర్ ఆడిట్ లో భాగంగా  మున్సిపాల్టీల్లో ఎన్ని సిమెంట్ పోల్స్ ఉన్నాయి, ఎన్ని ఇనుప పోల్స్ ఉన్నాయి. కొత్తగా విలీనం అయిన ఎన్ని గ్రామాలను కవర్ చేస్తున్నాం. అనే అంశాలను సమీకరించాలి. ఇనుప పోల్స్ తొలిగించాలి. విద్యుత్ బిల్లులు సక్రమంగా మున్సిపాల్టీలు చెల్లిస్తున్నాయా లేదా పరిశీలించాలి. ప్రతీ నెలా తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. విద్యుత్ పొదుపు పాటించాలి.  అవసరమైన చోట ఎల్ఈడీ లైట్లు పెట్టించడం... మున్సిపాల్టీల్లో ఇంకా పని చేయని విద్యుత్ బోర్ల కనక్షన్లు తీసివేయించడం, కెపాసిటర్లు వినియోగించడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. ఇలాంటి అంశాలు పరిశీలించాలి'' అని సూచించారు. 

''శానిటైజేషన్ ఆడిట్ లో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ చేస్తున్నారా లేదా, డంప్ యార్డుల నిర్మాణం, నిర్వహణపైన దృష్టి సారించాలి. ప్రజల్లో తడి, పొడి చెత్త వేసేలా చైతన్య పరచాలి. శానిటరీ సిబ్బంది పేర్లను వార్డుల్లో ప్రదర్శించడం, వారి ఫోన్ నంబర్లు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచడం, చెత్త సేకరిస్తున్నారా లేదా అని వార్డుల్లో ఇళ్ల వద్ద రిజిస్టర్లు పెట్టి నిఘా పెట్టడం చేపట్టాలి. శానిటరీ సిబ్బందికి ప్రతీ నెల మొదటి వారంలోనే 12 వేల రూపాయలు జీతం ఇవ్వాల్సిందే. అన్ని మున్సిపాల్టీల్లో కమిషనర్లు విధిగా జీతం ఎంత ఇస్తున్నారన్నది పరిశీలించాలి. ప్రభుత్వం నిర్ణయాన్ని పాటించాల్సిందే. వారికి అవసరమైన  దుస్తులు, బూట్లు, మాస్క్ లు ప్రభుత్వం తరపున మనమే అందించాలి. కాంట్రాక్టర్ల కింద పని చేస్తున్నా నిర్ణయించిన జీతం ఇవ్వాల్సిందే'' అని కేటీఆర్ ఆదేశించారు. 

'' ఆగష్టు 15వ తేదీలోగా అన్ని మున్సిపాల్టీల్లో ప్రతీ వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలి. ఇందులో  50 శాతం షీ టాయిలెట్లు ఉండాలి. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతాం. ప్రతీ మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్  ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్ లో ఉండాలి. బయోలాజికల్ వెస్టేజ్, బయో మెడికల్ వేస్టేజ్, కనస్ట్రక్షన్ అండ్ డెమాలీష్ వెస్టేజ్  నిర్వహణ  చేపట్టాలి. మాంసం, కోళ్లు, చేపల అమ్మకం దార్లతో సమావేశం పెట్టి వాటి నిర్వహణ చేపట్టాలి. బయోమెడికల్ వెస్టేజ్ ను వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి ఆధునిక పద్ధతుల్లో చేపట్టాలి. కనస్ట్రక్షన్  అండ్ డెమెలీష్ వేస్టేజ్ తో టైల్స్ తయారు చేయవచ్చు. ఇలాంటి ప్రాజెక్టును ఉమ్మడి మెదక్ జిల్లా లో ఏర్పాటు చేయాలి'' అని సూచించారు. 

'' కుక్కల బారినుండి ప్రజలను కాపాడేందుకు యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. చెత్త సేకరణ , నిర్వహణలో సిద్దిపేట ఆదర్శంగా ఉంది. అక్కడకు వెళ్లి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పరిశీలించాలి'' అని సూచించారు. 

''వాటర్ ఆడిట్ లో భాగంగా మున్సిపాల్టీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నాం, మనకు ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అని అంచనాలు తయారుచేయాలి. సింగపూర్ లాంటి దేశాల్లో 100 లీటర్ల నీటికి 90 లీటర్ల బిల్లులు వస్తాయి. పది శాతం నీరు ట్రాన్స్మీట్ లాస్ అవుతుంది. మన దగ్గర  100 లీటర్ల నీటికి 60 లీటర్లకు కూడా బిల్లులు రావడం లేదు. ఈ పరిస్థిత మారాలి. ప్రజలకు మంచి నీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికాబద్దంగా ఇస్తే బిల్లులు చెల్లించడానికి వెనుకాడరు. నల్లా కనెక్షన్ తెల్ల కార్డు వారికి 1 రూపాయి, మిగతా వారికి 100 రూపాయలకు ఇవ్వాలి. రాష్ట్రమంతా ఇదే విధానం అనుసరించాలి.ప్రతీ మున్సిపాలిటీలో నర్సరీలు ఒకటి కన్నా ఎక్కువ ఉండేలా చర్య తీసుకోవాలి'' అని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios