సారాంశం

కేసీఆర్ భరోసా పేరుతో  కార్యక్రమాన్ని  నిర్వహించనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్:తమ ప్రభుత్వం  మూడో దఫా అధికారంలోకి వస్తే  ఏం చేయనున్నామో  కేసీఆర్ భరోసా పేరుతో  కొత్త  కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, రామ్మూర్తిలు  బుధవారం నాడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.  ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో  మంత్రి  కేటీఆర్ ప్రసంగించారు.కేసీఆర్ భరోసా కింద 15 కార్యక్రమాలను అమలు చేస్తామని కేటీఆర్ వివరించారు.కేసీఆర్ మళ్లీ గెలిస్తే  కచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

 బీఆర్ఎస్ ను ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారన్నారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత  ఒక్కో సమస్యను  పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని  కేటీఆర్ చెప్పారు.విద్యుత్ సమస్య, నీళ్ల సమస్యను పరిష్కరించుకున్నామని  కేటీఆర్ తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా అంతా పచ్చగా మారిందని  కేటీఆర్ చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా అంతా పచ్చగా మారిందని  కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా  ఈ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు జిల్లాలు పచ్చదనం కనిపిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు విద్యుత్ అధికారులు  రైతుల మోటార్లకు తీగలు కట్ చేసి తీసుకెళ్లేవారని ఆయన గుర్తు చేశారు.

కర్ణాటకలో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గంటల పాటు విద్యుత్ ను కూడ  వ్యవసాయానికి కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోవద్దని  ఆయన  ప్రజలను కోరారు.  కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటకలో  నెలకొన్న పరిస్థితులే దాపురిస్తాయని కేటీఆర్ చెప్పారు.ఎఐసీసీ చీఫ్ ఖర్గే స్వంత రాష్ట్రం కర్ణాటకలోనే  ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ విమర్శించారు.

వ్యవసాయానికి మూడు గంటల పాటు విద్యుత్ సరిపోతుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.24 గంటల విద్యుత్ అవసరమా,  మూడు గంటల విద్యుత్ అవసరమా తేల్చుకోవాలని  తెలంగాణ ప్రజలను కేటీఆర్ కోరారు. 11 దఫాలు  కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే  ప్రజలను మోసం చేశారని  కేటీఆర్ విమర్శించారు.  కర్ణాటకలోనే  రైతులకు  ఐదు గంటల విద్యుత్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో  ఏం చేస్తుందని  ఆయన  ప్రశ్నించారు.