కొవాగ్జిన్కు కేంద్రం అనుమతి: భారత్ బయోటెక్కు కేటీఆర్ అభినందనలు
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు మంత్రి అభినందనలు తెలిపారు.
టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తల సేవలను కేటీఆర్ ప్రశంసించారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషి వల్లే హైదరాబాద్కు ఖ్యాతి వచ్చిందన్నారు.
అంతకుముందు కొవాగ్జిన్ను షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీంతో ఆదివారం భారత ఔషధ నియంత్రణ సంస్ధ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది.
ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్, పుణే ఎన్ఐవీల సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ను రూపొందించింది.
మరోవైపు శుక్రవారం ఆక్స్ఫర్డ్- అస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.