ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే తాట తీయండి: అధికారులకు కేటీఆర్ ఆదేశం
ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారి తాట తీయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు అదికారులు కృషి చేయాల్సిందిగా కోరారు. అధికారులు ఎవరికి భయపడవద్దని ఆయన సూచించారు.
హుజూర్నగర్: ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారి తాట తీయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు అదికారులు కృషి చేయాల్సిందిగా కోరారు. అధికారులు ఎవరికి భయపడవద్దని ఆయన సూచించారు.
హుజూర్నగర్ లో ఆర్డీఓ కార్యాలయాన్ని సోమవారంనాడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా హుజూర్నగర్ అభివృద్ధికి అందరం చిత్తశుద్దితో కలిసి పని చేద్దామన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడ ఆపలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు బంధు పథకం కింద రైతులకు రూ. 27 వేల కోట్లను పెట్టుబడి సహాయం కింద ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులు జమ చేశామన్నారు.
ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కూడ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.పట్టణాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేసే క్రమంలో నూతన మున్సిపల్ యాక్ట్ ను తీసుకొచ్చినట్టుగా చెప్పారు.
మొక్కలు పెంచని కౌన్సిలర్లపై చర్యలు తీసుకొంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తొలుత టీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకొంటామన్నారు.
హుజూర్ నగర్ ప్రజలకు సీఎం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొంటామని ఆయన చెప్పారు.