కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. నియోజకవర్గ అభివృద్ధిని జగ్గారెడ్డి విస్మరించారని మంత్రి విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరని మంత్రి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. బుధవారం సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పిన హరీశ్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిని జగ్గారెడ్డి విస్మరించారని మంత్రి విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరని మంత్రి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయానికి కృషి చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మంత్రి వ్యాఖ్యానించారు.
అంతకుముందు జమిలి ఎన్నికల ప్రతిపాదనపై స్పందించారు మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదిపై బీజేపీకి ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ వివక్ష చూపుతోందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాది వారికి చోటు లేకుండా చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ కీలక శక్తిగా ఎదుగుతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ALso Read: జమిలి ఎన్నికలు.. సౌత్లో ఓడిపోతామనే, కమిటీలో ఒక్క దక్షిణాది వారున్నారా : హరీశ్రావు
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలపైనా మంత్రి చురకలంటించారు. కొందరు డిక్లరేషన్లు అంటూ నాటకాలకు తెరలేపారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు డిక్లరేషన్ ఇచ్చారని.. చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్లు, గెలవని కాంగ్రెస్కు హామీలెక్కువ అంటూ హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఛత్తీస్గఢ్ , కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుందని.. కానీ వికలాంగుల పెన్షన్ రూ.1000 మాత్రమేనని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ముగిసిపోతుందని హరీశ్ రావు హెచ్చరించారు. ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు.
