మనల్ని నూకల్ని తినమంటారా.. బీజేపీ వాళ్ల తోకలు కట్ చేయండి : రైతులకు హరీశ్రావు పిలుపు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. నూకలు తినాలన్న బీజేపీ నేతలు గ్రామాల్లోకి వస్తే తోకలు కత్తిరించాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అని ఆయన సెటైర్లు వేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనమంటే కేంద్రం అవహేళన చేసిందని.. నూకలు తినాలన్న బీజేపీ నేతలు గ్రామాల్లోకి వస్తే తోకలు కత్తిరించాలని ఆయన పిలుపునిచ్చారు. తాము పేదలకు అన్నీ ఉచితంగా పంచుతుంటే.. కేంద్రం అన్నీ పెంచుతోందని హరీశ్ విమర్శించారు. డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అని ఆయన సెటైర్లు వేశారు. కోవిడ్ సమయంలో ఏఎన్ఎంలు చేసిన సేవలు ప్రశంసనీయమని, అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. త్వరలో గర్భిణుల కోసం తెలంగాణ వ్యాప్తంగా 58 టిఫా స్కానింగ్ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు అయ్యేవని, ప్రస్తుతం అవి 67 శాతానికి పెరిగాని హరీశ్ రావు వెల్లడించారు. ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి తామూ కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ALso REad:మోదీ జీ.. బీజేపీ నేతల తిట్లు కేసీఆర్ను ఇంకెంత బలవంతుడిని చేస్తాయి: మంత్రి హరీష్ రావు కౌంటర్
ఇకపోతే... ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్పోర్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తాను అనితీని అంతమొందిస్తున్న క్రమంలో కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రోజూ 2-3 కిలోల తిట్లు తిడుతున్నారని.. అవే తనకు పోషకాహారంగా మారుతాయని మోదీ తెలిపారు. అయితే ఈ కామెంట్స్పై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. అలా అయితే బీజేపీ నేతల తిట్లు కేసీఆర్ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు. దేశానికీ, తెలంగాణకు ఏం చేశారని తాము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ అంటూ విమర్శించారు.