ఆ పని చెస్తే... మీరే కాదు మేము కూడా ఈటలకే ఓటేస్తాం: మంత్రి హరీష్ సంచలనం
సీఎం కేసీఆర్ ఒక్క హుజరాబాద్ నియోజకవర్గానికే దళిత బంధు ద్వారా రెండువేలు ఇచ్చినట్లుగానే కేంద్రం నుండి ఈటల కూడా రెండు వేల కోట్లు తేవాలని... అలా తెస్తే తాము కూడా ఆయనకే ఓటు వేస్తామని మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్: ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ హుజురాబాద్ కు రెండు వేల కోట్లు తెస్తే మీరే కాదు మేము కూడా ఆయనకే ఓట్లు వేస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఒకరు దుబ్బాకలో, నిజామాబాద్ లో మరొకరు గెలిచి ఏం తెచ్చారని ప్రశ్నించారు. తన బాధను ప్రజల బాధగా చూపించి ఈటెల లబ్ధి పొందాలని చూస్తే... సీఎం కేసీఆర్ ప్రజల బాధను తన బాధగా భావించి వారికి లబ్ది చేస్తున్నారని హరీష్ పేర్కొన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణ వ్యవసాయ మార్కెట్ లో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో సీపీఐ, ఏఐటియూసి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... హుజురాబాద్ కు డబుల్ దమాకా తగిలిందన్నారు. ఒకే నియోజవర్గ పరిధిలో గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం వుందని... దీంతో హుజురాబాద్ కు డోకా ఉండదన్నారు.
''హుజురాబాద్ లో పోటీ టీఆర్ఎస్, బిజెపిల మద్య కాదు రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ. మార్కెట్ యార్డుల రద్దు, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచడం బిజేపి పని. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు భీమా ఇవ్వడం టీఆర్ఎస్ పని. దేశంలో బిజెపి ప్రభుత్వం రైతులపై రబ్బర్ బుల్లెట్లు, బాష్ప వాయువులతో దాడి చేయిస్తోంది'' అన్నారు.
read more మీ ఓటు ఎటువైపు... ఈటల కుట్టు మిషన్లకా... కేసీఆర్ కళ్యాణ లక్ష్మికా?: హరీష్ రావు (వీడియో)
''కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలి... ఇచ్చే భాధ్యతను నేను తీసుకుంటాను. అందరు మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిచ్చి లబ్ధిదారులను ఇళ్లల్లోకి పంపించాం. కానీ ఏడేళ్లు మంత్రిగా వున్న ఈటెల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు... అలాంటిది ఎమ్మెల్యేగా ఒక వేల గెలిచినా ఒక్క ఇళ్ళయినా కట్టగలుగుతాడా? బండి సంజయ్ గెలిచి ఇక్కడ ఒక లక్ష రూపాయల పని చేసిండా?'' అని ప్రశ్నించారు.
''టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.50వేల రైతుల రుణాలు మాఫీ చేశాం. మిగితాది కూడ మాపీ చేస్తాం. హుజురాబాద్ లో శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నేను హామీ ఇస్తున్నాను'' అని హరీష్ ప్రకటించారు.
''రక్త సంబంధం కంటే వర్గ సంభంధం గొప్పది అంటడు ఈటెల. కాషాయ జెండా పార్టీలో ఉండి ఎర్ర జెండా డైలాగ్ కు కొడితే ప్రజలు నిన్ను నమ్మరు. రేపు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు కావాలంటే కేసీఆర్ తో సాధ్యం అవుతుంది. బొట్టు బిల్లలకు, ఆసరా పెన్షన్ కు మధ్య పోటీ జరుగుతుంది. పోయిన ఎన్నికలో బిజేపికి డిపాజిట్ రాలేదు ఒక్కసారి ఆలోచించండి'' అని మంత్రి హరీష్ సూచించారు.