సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిల్లీ పెత్తనం పెరుగుతుందని...  తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరు మారనుందని మంత్రి హరీష్ రావు అన్నారు. 

సంగారెడ్డి : ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల అమలు కాదు ఆర్నెళ్లకో సీఎం మారడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. ఆరు నెలలకు ఓసారి అల్లర్లు జరిగ కర్ఫ్యూ, 24గంటల ఉచిత విద్యుత్ బదులు ఆరుగంటలే కరెంట్ వుంటుందని... వారానికి రెండు పవర్ హాలిడేలు ఉంటాయన్నారు. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారంటూ సంచనల వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేలకు మళ్లీ డిల్లీ హైకమాండ్ అవుతుందని... వయా రెండో రాజధాని బెంగళూరు మీదుగా డిల్లీ వెళ్లాల్సి వస్తుందని హరీష్ రావు   అన్నారు. 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు, 350మందికి గృహలక్ష్మి పట్టాలను మంత్రి హరీష్ అందజేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీ హామీలు అమలయ్యేవి కావని... కేవలం ఎన్నికల కోసమే వీటిని ప్రకటించారని అన్నారు. ఈ గ్యారెంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటివని అన్నారు. బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి సూచించారు. ఇప్పుడు చేస్తున్నట్లు రేపటికి కూడా సీఎం కేసీఆర్ చాలా చేస్తారన్నారు. త్వరలోనే బిఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని... ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ మాటిచ్చాడంటే చేసి చూపిస్తాడని... అందుకు నిదర్శనమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణమని హరీష్ అన్నారు. నారాయణ్ ఖేడ్ కి ఏం కావాలో సీఎం కేసీఆర్ కు తెలుసు... అందులో భాగంగానే రూపాయి ఖర్చు లేకుండానే వంద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చారని అన్నారు. ఇవాళ వారు ఎంతో ఆనందంగా ఇళ్లల్లోకి వెళుతున్నారని హరీష్ అన్నారు. 

Read More  తెలంగాణలో కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు ఖాయం..: ఏపిసిసి చీఫ్ రుద్రరాజు

ఎన్నికల్లో ప్రజల ఓట్లకోసమే కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ అన్నారు. ఇక్కడ తెలంగాణలో ఇచ్చిన హామీలను ముందు అధికారంలో వున్న కర్ణాటకలో అమలు చేసి మాట్లాడాలని అన్నారు. పక్కనేవున్న కర్ణాటకలో కేవలం రూ.600 పించన్ ఇస్తున్నారు... రైతు బంధు లాంటి పథకమే లేదన్నారు.  కరెంట్ కోతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. కానీ తెలంగాణలో ఏదో చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లు అధికారంలో వుండి ప్రజలకు చేసిందేమీలేదన్నారు హరీష్ రావు. కానీ ఈ పదేళ్లలో తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. తాగునీటి సమస్యతో బాధపడే నారాయణఖేడ్ ప్రాంతంలో ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్ళు ఇస్తున్నామని అన్నారు. ఇక కాళేశ్వరం నుండి సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాన్ని తడుపుతామని మంత్రి అన్నారు. 

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఏం చేసారో చెప్పకుండా కేవలం కేసీఆర్ ను తిట్టడమే ఆ పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారని హరీష్ అన్నారు. వీరి తిట్లు పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజలకు కిట్లు ఇస్తున్నారని అన్నారు. కాబట్టి కిట్లు ఇచ్చే వాళ్ళు కావాలో, తిట్టేవాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రజా నాయకుడు... కాబట్టి ఆయనను మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేయాలని నారాయణఖేడ్ ప్రజలను కోరారు హరీష్ రావు.