కరీంనగర్లో జరిగిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల్లో బీజేపీ ఏవి నెరవేర్చిందని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇచ్చారా అని నిలదీశారు. అలా ఇచ్చి వుంటే ఇప్పటికే 15 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి వుండాలి కదా అని హరీశ్ రావు చురకలంటించారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, మరి ఎంతమంది ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రూపాయి విలువ పెంచుతామన్నారని, పెంచారా, దించారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఎంతసేపూ ఎవరికి వెన్నుపోటు పొడవాలి..? ఎలా గెలవాలి అనేదే మీ ఆలోచన అంటూ హరీశ్ దుయ్యబట్టారు. కానీ కేసీఆర్ ప్రజలకు ఎలా సేవ చేయాలని ప్రతిక్షణం ఆలోచిస్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు ఇచ్చేది ముందే తెలుసునని హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చెబుతారు, ఈడీ నోటీసులు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ALso REad:దర్యాప్తు సంస్థలు కేసీఆర్ కూతురుకు సమన్లు పంపడానికి కారణం ఏమిటి?: జేపీ నడ్డా
ఇకపోతే... గురువారం కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల వారికి సాధికారత కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. లంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తుందని నడ్డా విమర్శించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిలకు ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘బండి సంజయ్ నాయకత్వంలోని ప్రజాసంగ్రామ యాత్ర 114 రోజుల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 5 దశల్లో 1458 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’’ అని అన్నారు. తాను వస్తున్న సమయంలోనే టీఆర్ఎస్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఒకప్పుడు ఎవరైనా గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారని, దళిత వ్యక్తి రాష్ట్రపతి అవుతారని అనుకున్నారా? అని అడిగారు. అసదుద్దీన్ ఒవైసీతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం కేసీఆర్కు ఇష్టం లేదని విమర్శించారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల క్రూరత్వం, వారు సమాజాన్ని ఎలా విభజించడానికి ప్రయత్నించారో మనకు తెలిసిందేనని నడ్డా కామెంట్ చేశారు.
