ప్రజారోగ్యానికి తెలంగాణ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది: గంగుల కమలాకర్
Karimnagar: ప్రజారోగ్యానికి తెలంగాణ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లోని సుడా కార్యాలయంలో ఆయన స్వీపింగ్ మిషన్లను ప్రారంభించారు.
BC Welfare Minister Gangula Kamalakar: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. సోమవారం కరీంనగర్లోని సుడా కార్యాలయంలో ఆయన స్వీపింగ్ మిషన్లను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది" అని సోమవారం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) కార్యాలయ ఆవరణలో ఆటోమేటిక్ స్వీపింగ్ మిషన్లను ప్రారంభించిన అనంతరం మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం, ప్రజారోగ్యం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే పారిశుద్ధ్యానికి నిధులు అధికంగా కేటాయిస్తున్నామని తెలిపారు. డెంగ్యూ, వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కరీంనగర్ పట్టణాన్ని సుందరమైన, ఆరోగ్యవంతమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ రూరల్ మండలంతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులను శుభ్రం చేసేందుకు సుడా నిధుల నుంచి రూ.1.64 కోట్లతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్లను సోమవారం ప్రారంభించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఐదు వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా పారిశుధ్య పనులు మరింత మెరుగ్గాజరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వి కర్ణన్, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, జెడ్పి చైర్పర్సన్ కనుమళ్ల విజయ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మునుగోడులో టీఆర్ఎస్ ను ఓటువేసి తమ అభ్యర్థిన గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. "మునుగోడు ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలి అని కుటిల కుట్రలు చేసిన బీజేపీ పార్టీకి బుద్ది చెప్పిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు" అని ఆయన ట్వీట్ చేశారు.
అలాగే, టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఎస్లో పాదయాత్ర చేస్తుంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పిచ్చి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. "ఇంతమంది ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే విషయాల్లో క్లారిటీ లేదని" నిలదీశారు. అలాంటి నేతలను తెలంగాణకు పంపవద్దని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాయాలని అనుకున్నానని అన్నారు. వారు కోరుకుంటే, ఎర్రగడ్డ ఆసుపత్రిని ఏపీ రాష్ట్రానికి మారుస్తామని కూడా పేర్కొన్నారు. తద్వారా అలాంటి వారిని అక్కడి మానసిక కేంద్రంలో చేర్చవచ్చని తెలిపారు.