ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డిపై దాడి.. మంత్రి ఎర్రబెల్లి స్పందన
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిపై దాడిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమేందర్రెడ్డి బీజేపీ కండువాతో పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే మా వాళ్లు అడ్డుకున్నారని తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిపై దాడిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమేందర్రెడ్డి బీజేపీ కండువాతో పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే మా వాళ్లు అడ్డుకున్నారని తెలిపారు.
అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఎవరిపై దాడి చేయలేదని ఎర్రబెల్లి చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే 72 శాతం పోలింగ్ నమోదైందని మంత్రి తెలిపారు. ఇది చరిత్రలో రికార్డు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరగలేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమీషన్ తెలిపింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్ఎస్ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్రావు, కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య గట్టి పోటీ నడిచింది.
ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ నుంచి సుగ్గు ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు.