మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు గత మూడు రోజుల నుంచి మధ్యాహ్న భోజనం అందడం లేదు.
బంగారు తెలంగాణ లో విద్యార్థుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదనుకుంటా. మిగులు రాష్ట్రంలో ... ధనిక రాష్ట్రంలో అర్ధాకలితో బడిపిల్లలు అలమటిస్తుంటే సర్కారు మాత్రం చోద్యం చూస్తోంది.
రాష్ట్రంలో అత్యంత వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబు పేట మండలం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బంద్ అయింది.
అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత మూడు రోజులుగా ఈ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం లేదు. దీంతో బడికి వచ్చిన పిల్లలు మంచినీటితో కడుపు నింపుకుంటున్నారు.
ఈ నెల బియ్యం కోటా స్కూల్ కు కేటాయించినా... అధికారుల నిర్లక్ష్యం వల్ల అది పాఠశాలకు చేరలేదని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎఈవో ఇప్పటి వరకు స్పందించలేదు.
కాగా, ఈ ఘటన వివరాలు తెలియడంతో డీఈవో పాఠశాలకు చేరుకొని విద్యార్థులను ఆరా తీశారు. కన్నీటి పర్యంతమైన విద్యార్థులు మూడు రోజుల నుంచి మంచినీటితోనే కడుపు నింపుకుంటున్నట్లు తెలిపారు. దాతలు అందించిన బిస్కెట్లతోనే మధ్యాహ్న భోజనం కానిస్తున్నామని గోడు వెల్లబోసుకున్నారు.
