ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి బాబాయ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. నిజంగా తమ బిడ్డను బ్రతికించాలని ప్రభుత్వానికి వుంటే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి పంపేవారని ఆయన అన్నారు. 

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుంది. మరికాసేపట్లో ఆమె ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రీతి ఆరోగ్యంపై ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఠాగూర్ సినిమా లెక్క వుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికేమో ఒకటి చెప్పి.. నిమ్స్ చుట్టూ పోలీసులను మోహరిస్తున్నారని ప్రీతి బాబాయ్ ఎద్దేవా చేశారు. నిజంగా తమ బిడ్డను కాపాడాలని ప్రభుత్వం అనుకుంటే ప్రైవేట్ ఆసుపత్రికి పంపేవారని రాజ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. 

అంతకుముందు ఆమె తండ్రి మాట్లాడుతూ.. తన బిడ్డ బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని ప్రీతి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైఫ్‌ను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజు ఉదయం 4.30కి ఘటన జరిగితే 8 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆయన ఆరోపించారు. ప్రీతి మొబైల్స్‌లో వాళ్లకు కావాల్సినట్లు సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారని ప్రీతి తండ్రి వ్యాఖ్యానించారు.

ALso REad: మెడికో ప్రీతి కేసు .. నా బిడ్డ బతకదంటున్నారు : కన్నీటి పర్యంతమైన తండ్రి

ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.