కేంద్రం మార్కెట్ యార్డులు మూసినా రాష్ట్రంలో కొనసాగిస్తాం: కేసీఆర్ హామీ
నూతన వ్యవసాయ చట్టాల ద్వారా మార్కెట్ యార్డులు మూసివేసినా రాష్ట్రంలో మార్కెట్ యార్డులను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాల ద్వారా మార్కెట్ యార్డులు మూసివేసినా రాష్ట్రంలో మార్కెట్ యార్డులను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
బుధవారం నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను తాము కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. కరోనా సమయంలో ప్రతి పంటను కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ, 50 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది కూడ కనీసం రూ. 80 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు. సివిల్ సప్లయ్ కార్పోరేషన్ కు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తామని ఆయన హమీ ఇచ్చారు.
నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు న్యాయం చేస్తాయని ప్రధాని కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.రాష్ట్రాల హక్కులను కాంగ్రెస్, బీజేపీలు కబళించాయన్నారు.
నూతన వ్యవసాయచట్టాలపై పార్లమెంట్ చట్టం తేసిందన్నారు. అయితే ఈ చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు.మార్కెట్ యార్డుకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకెళ్లాలని ఆయన రైతులకు సూచించారు. తేమ శాతం లేని ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తీసుకెళ్లాలన్నారు.
మార్కెట్ యార్డులతో పాటు గ్రామాల్లో కూడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.