మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్‌ రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారుల బృందం చేరుకుంది. అక్కడ మార్గదర్శి కేసులో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

హైదరాబాద్‌: మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్‌ రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారుల బృందం చేరుకుంది. అక్కడ మార్గదర్శి కేసులో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణకు సీఐడీ అధికారులు వీడియో, ఫూట్ కెమెరాలతో పాటు ప్రింటర్స్‌తో వచ్చారు. మార్గదర్శి చందాదారుల నగదు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో సీఐడీ అధికారులు.. శైలజా కిరణ్‌ను విచారిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఇక, రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టుగా గుర్తించినట్టుగా ఏపీ సీఐడీ తెలిపింది. 

ఇదిలా ఉంటే, మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే ఏపీ సీఐడీ అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్‌, ఎండీ, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు గుర్తించినట్టుగా ఏపీ సీఐడీ చెబుతుంది. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మున మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్‌ గ్రూపులు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని సీఐడీ పేర్కొంది. అయితే ఆ నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. 

అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించినట్టుగా సీఐడీ చెబుతుంది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇక, మార్గదర్శి కేసుకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై సీఐడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే రామోజీరావు, శైలజా కిరణ్‌లను కూడా సీఐడీ అధికారులు విచారించారు.