పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులపై మంథని ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు మండిపడ్డారు. న్యాయవాదుల జంట హత్య కేసులో పోలీసుల పాత్ర వుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు
పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులపై మంథని ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు మండిపడ్డారు. న్యాయవాదుల జంట హత్య కేసులో పోలీసుల పాత్ర వుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కనీసం హత్యను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. స్థానిక ఎస్సైకి ఈ హత్య ముందే తెలిసి వుంటుందని ఆరోపించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని శ్రీధర్ బాబు విమర్శించారు.
జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. నిందితులను పోలీసులే రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు లాయర్ల హత్యను టీఎస్ హైకోర్టు న్యాయవాదులు ఖండించారు.
Also Read:లాయర్ దంపతుల దారుణ హత్య: పరారీలో అనుమానితుడు కుంట శ్రీను
లాయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనుగా తెలుస్తోంది. ఇదే విషయంపై రామగుండం సీపీ మాట్లాడుతూ... కుంట శ్రీనుకి, వామన్రావుకి మధ్య గతంలో ఓ దేవాలయానికి సంబంధించిన వివాదం వుందని సీపీ చెప్పారు.
ఆ కోణంలో సైతం తాము దర్యాప్తు చేస్తున్నట్లు కమీషనర్ వెల్లడించారు. ఇప్పటికే శ్రీను అనుచరులుగా వున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సత్యనారాయణ తెలిపారు.
వామన్రావుకు గడిచిన కొద్దిరోజుల నుంచి ఫోన్లు చేస్తున్న వారి కాల్ డేటాను సేకరిస్తున్నామని.. దీనిని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం వుందని సీపీ అభిప్రాయపడ్డారు.
కుంట శ్రీనుకు సంబంధించిన ఓ కేసులో ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వామన్రావు వెళ్లినట్లుగా సత్యనారాయణ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుంట శ్రీను హత్య చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
