వర్షాలను ఎదుర్కొనేందుకు జిహెచ్ఎంసి స్కెచ్
బాగనే చేస్తరా? ఉత్త ఆరాటమేనా?
రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నందున జూన్ 1వ తేదీ నుండి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను నియమిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారాయన. ప్రస్తుత సీజన్లో వారం రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రవేశించినందున నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో నేటి నుండే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటుచేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిర్వహణ విభాగం చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్లతో పాటు సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటీవ్, డిప్యూటి ఇంజనీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో డా.బి.జనార్థన్రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేట్టే ప్రతి పనిలో సోషల్ ఆడిట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
గతంలో తరుచుగా ఏర్పడే పాట్హోల్స్ (రోడ్లపై గుంతల) పట్ల ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. ఈ సారి రోడ్లకు సంబంధించిన ఏ విధమైన విమర్శలు ఎదుర్కొకుండా ఉండేందుకు నగరంలో పీరియాడికల్ ప్రివెంటీవ్ మెయింటనెన్స్ (పి.పి.ఎం) రోడ్లను నిర్మిస్తున్నామని వివరించారు. ఈ పి.పి.ఎం రోడ్ల నిర్మాణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తక్కవ డ్యామేజి అయిన రోడ్లను కూడా తిరిగి వేయాల్సి వస్తుందని ఈ విషయంలో నగరవాసులకు తెలియచేయాలని స్పష్టం చేశారు.
తాము చేపట్టే ప్రతి పనుల వివరాలను సోషల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియ చేయాలని కోరారు. భారీ వర్షాల వల్ల నీటి ముంపు ప్రాంతాల్లో సరిపడా పంపింగ్ మిషన్లు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఇంజనీరు తప్పనిసరిగా 2016కు చెందిన వ్యర్థాల నిర్వహణ, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ప్లాస్టిక్ నిర్వహణ నిబంధనలు తప్పనిసరిగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.