వరంగల్ వ్యక్తి ఆత్మహత్య కలకలం.. ట్రాఫిక్ పోలీసుల వేధింపులే కారణమని ఫ్యామిలీ ఆరోపణ..!
వరంగల్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రాఫిక్ చలాన్లు కట్టమని ట్రాఫిక్ పోలీసులు ఒత్తిడే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
వరంగల్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రాఫిక్ చలాన్లు కట్టమని ట్రాఫిక్ పోలీసులు ఒత్తిడే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి వరంగల్ నగరంలోని ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. అయితే అతడి బండిపై 17 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఈ నెల 21న మొగిలి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు అతడి బండి ఆపారు. బండికి సంబంధించి చాలా చలాన్లు ఉన్నాయని.. అవి కట్టాలని ఒత్తిడి చేశారు.
ఈ క్రమంలోనే మొగిలి తాజాగా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ట్రాఫిక్ చలాన్లు కట్టనందుకు పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే మొగిలి తీవ్ర మనస్థాపం చెందాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మొగిలిని ఇష్టమొచ్చినట్టుగా దూషించారని.. దీంతో అతడు మనోవేదనకు గురయ్యాడని తెలిపారు.
మొగిలి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొగిలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)