కే.సీ.వేణుగోపాల్ నివాసానికి ఉత్తమ్, భట్టి: డీ.కే. శివకుమార్, ఠాక్రే తో చర్చలు
మల్లికార్జున ఖర్గే నివాసంలో చర్చలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ నివాసంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు.
![Mallu bhatti Vikra marka meets K.C. Venugopal in New Delhi lns Mallu bhatti Vikra marka meets K.C. Venugopal in New Delhi lns](https://static-ai.asianetnews.com/images/01gtp1pkwrnaj38g9sdfjd92b6/mallu-bhatti-vikramarka-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ నివాసంలో మంగళవారంనాడు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ హాజరయ్యారు.ఈ భేటీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ , కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు కూడ పాల్గొన్నారు.
ఇవాళ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే నివాసంలో సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్ చర్చించారు. అరగంట తర్వాత రాహుల్ గాంధీ, కే. సీ. వేణుగోపాల్ సమావేశం నుండి వెళ్లిపోయారు. వీరిద్దరూ వెళ్లిపోయిన గంట తర్వాత డీ.కే. శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలు ఖర్గే నివాసం నుండి బయటకు వచ్చారు. హైద్రాబాద్ కు సీల్డ్ కవర్ తో వెళ్తున్నట్టుగా ప్రచారం సాగింది. ఖర్గే నివాసం నుండి బయటకు వచ్చిన డీ.కే.శివకుమార్ , మాణిక్ రావు ఠాక్రేలు న్యూఢిల్లీలోనే మరో ప్రాంతంలో రెండు గంటలున్నారు. అక్కడి నుండి కే.సీ. వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు.
కే.సీ. వేణుగోపాల్ నివాసానికి మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ వచ్చారు. సీఎం పదవి విషయం తమ పేర్లను కూడ పరిశీలించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు కోరుతున్నారు. ఒకవేళ సీఎం పదవిని ఇవ్వలేకపోతే డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై ఈ ఇద్దరు నేతలు పార్టీ నాయకత్వం వద్ద తమ అభిప్రాయాలను తెలపనున్నారు.