‘మీ ప్రశ్న నేను అడుగుతా’ నంటూ మల్లారెడ్డి విద్యార్థులతో ఒక కొత్త ప్రయోగం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అతితక్కువగా వినిపించే పేరు మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి ది. లోక్ సభ సభ్యుడే గాని ఆయన రాజకీయాలు మాట్లాడింది తక్కువ. తమ నాయకుడు ఒకపుడు చంద్రబాబు, ఇపుడు కెసిఆర్ ను భూజానేసుకుమోసింది కూడా బాగా తక్కువ. ఏదో ఆయనకు సీటొచ్చింది. ఎందుకిచ్చారో అందిరికి తెలుసు. ఇలాగెలిచారు. అయితే, ఇపుడాయన ఒక సంచలన వార్త అయ్యారు. ఆయన పార్లమెంటు కోసం ఒక కొత్త ప్రయోగం చేపట్టారు. బహుశా పార్లమెంటుసభ్యులెవరూ ఇలాంటి ప్రయోగం చేసి ఉండరు.

పార్లమెంటులో ఎంపిలు తెగ ప్రశ్నలు వేస్తుంటారు. నియోజకవర్గం సమస్యల మీద, జాతీయ సమస్యల మీద ఈ ప్రశ్నలుంటాయి. వీటిని ఎవరికో అయిదువేలో పది వేలో ఇచ్చి రాయిస్తు ఉంటారు. వాళ్లు సొంతంగా ప్రశ్నలేయడం అరుదు. పార్లమెంటులో ఎంపిలకు ప్రశ్నలురాసివ్వడం మంచి ఉద్యోగం. ఇలా కొన్ని ప్రశ్నలేయడంలో కొంతమంది నెంబర్ వన్ అయిన మంచిపేరు తెచ్చకుంటూ ఉంటారు. చాలా సార్లు కాంగ్రెస్ ఎంపి టి సబ్బరామిరెడ్డి నెంబర్ వన్ అయ్యారు. అయితే మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి (టిడిపి తరఫున గెల్చారు. బంగారు తెలంగాణ కోసమని ఆయన టిఆర్ ఎస్ లోకి ఫిరాయించారు.)

ఈప్రశ్నలకోసం ఒక ప్రయోగం చేశారు. మీరు ప్రశ్నలివ్వడం, వాటిని నేను పార్లమెంటులో ప్రస్తావస్తానని నియోజకర్గంలోని విద్యార్థులకు ఒక ఆఫర్ ప్రకటించారు. ఇలా వచ్చిన ప్రశ్నలలోంచి ఉత్తమ ప్రశ్నలను ఎంపిక చేసి, ఆ ప్రశ్నలేసిన విద్యార్థితోపాటు తల్లితండ్రులను కూడా పార్లమెంటుకు తీసువెళతానని కూడా ప్రకటించారు. మొదట్లో నలుగరు విద్యార్థులను తీసుకువెళతానని ప్రకటించారు. ఈ ప్రయోగానికి విపరీతమయిన స్పందన రావడంతో ఆయన 37 మంది విద్యార్థులను తల్లితండ్రులతో కలిపి పార్లమెంటుకు తీసుకువెళ్తాలనని నిర్ణయించారు.
ఆయన ప్రకటనకు ఎన్ని ప్రశ్నలొచ్చాయోతెలుసా?
36 వేల మంది విద్యార్థులు స్పందించారు. 36 వేల ప్రశ్నలొచ్చాయి. ఇందులో నుంచి ‘మీ ప్రశ్న నేను అడుగుతా’ కార్యక్రమం కోసం 37 మంది విద్యార్థులు పంపిన ప్రశ్నలను ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన కొన్ని ప్రశ్నలు:
- బడిపిల్లలు పుస్తకాల బ్యాగు భారం అధికమవుతోంది, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలేంటి?
- దేశంలో ఒకటే పన్ను విధానంలో భాగంగా జీఎస్టీ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిని ఒకేతాటిపైకి తీసుకురావాలి. ఫిన్లాండ్ తరహా విద్యావిధానం ప్రవేశపెట్టేలా చూస్తారా?
- పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యం పెంచాలి, లైబ్రరీలను ఆధునీకరించేలా చూడండి.
- నానాటికీ పెరుగుతున్న ధరల నియంత్రణకు చేపట్టేల చర్యలేవీ?
- ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజలకు చేరువ చేయడానికి స్థానికంగా ప్రతి వార్డు కార్యాలయంలో అధికారిని అందుబాటులో ఉంచేలా చూడాలి
- వస్తుసేవా పన్ను, జీఎస్టీని ఆసరా చేసుకుని కొందరు దుకాణదారులు సాధారణ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీరినెలా కట్టడి చేస్తారు?
- పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాతం అధికంగా ఉంది, దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా?
- అగ్రవర్ణాల్లో నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముందా?
- ఆధార్– ఓటర్కార్డు అనుసంధానం చేసి, బోగస్ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? విద్య, వైద్య ఖర్చులకు ఆధార్ను అనుసంధానిచాలి.

ఇపుడు నడుస్తున్న శీతాకాల పార్లమెంటు సమావేశాలుముగిసేలోపు వీరందరిని పార్లమెంటుకు తీసుకువెళతానని మల్లారెడ్డి చెప్పారు. విద్యార్థులు సూచించిన ప్రశ్నల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఆయన లోక సభలో 332 ప్రశ్నలడిగానని చెప్పారు.
