విషాదం.. మలక్ పేట హిట్ అండ్ రన్ కేసు.. డాక్టర్ శ్రావణి కన్నుమూత..
హిట్ అండ్ రన్ కేసులో గాయపడ్డ డాక్టర్ శ్రావణి చనిపోయారు. బైక్ మీద వెడుతున్న శ్రావణికి కారు ఢీకొట్టి పారిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : మలక్పేట్ లో మూడు రోజుల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు.
నిందితుడిని ఓల్డ్ మలక్పేట్ చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని పోలీసులు వెల్లడించారు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహించేవారు.ఇదిలా ఉంటే, నెల రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే శ్రావణికి ఇలా అయ్యింది.
సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేసుకుని శ్రావణి వెళుతుండగా గుర్తుతెలియని కారు ఒకటి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా .. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను పోలీసులు గుర్తించారు.