రేవంత్ కు వేస్తే లోకేష్ కు తాకిన మోత్కుపల్లి బాణం
- టిడిపి రాజకీయాల్లో ఊహించని మలుపు
- లోకేష్ కు కాక పుట్టించిన మోత్కుపల్లి మాటలు
- రేవంత్ పై బాణమేస్తే లోకేష్ కు తాకిన వైనం
- పార్టీలో హాట్ టాపిక్ అయిన మోత్కుపల్లి కామెంట్స్
కరుకు భాషలో విరుచుకుపడడంలో తెలంగాణలో సీనియర్ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు తర్వాతే ఎవరైనా. మోత్కుపల్లి టార్గెట్ చేశారంటే ఎంతటి వరకైనా వెళ్లి విమర్శలు చేయగలరు. గతంలో కేసిఆర్ మీద కానీ, నాగం జనార్దన్ రెడ్డి మీద కానీ మోత్కుపల్లి మాటల దాడి ఎలా ఉండేదో తెలుగు ప్రజలందరికీ తెలుసు. తాజాగా మోత్కుపల్లి బాణం రేవంత్ మీదకు గురి పెట్టింది. బాణం వదిలిండు మోత్కుపల్లి. కానీ అది రేవంత్ ను కాకుండా నారా లోకేశ్ కు తాకింది. అదెట్లా అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ముఖ్య నేతల సమావేశం అనంతరం తన ఇంటి దగ్గర మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. జిహెచ్ఎంసి ఎన్నికలను భుజాన వేసుకోవడమే కాకుండా స్టార్ కాంపెయినర్ గా రేవంత్ వ్యవహరించి పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాడని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో రేవంత్ రెడ్డి నిరాటంకంగా పర్యటనలు చేసినా ఒక్క సీటుకూడా గెల్చుకోలేక పోయామని ఎద్దేవా చేశారు. అంతకముందు 22 శాతంగా ఉన్న ఓటు బ్యాంకు రేవంత్ పుణ్యమా అని 10 శాతానికి పడిపోయిందని బాంబు పేల్చారు.
నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల బాద్యతను భుజాన వేసుకుని ఉధృత ప్రచారం నిర్వహించింది లోకేష్ బాబే. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి వార్డులో పర్యటించి టీడిపి గెలుపు కోసం అలుపెరగని ప్రచారం చేశారు లోకేష్. అంతే కాకుండా ప్రచారం చివరి రోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఔరా అనిపించారు లోకేష్. ఒకవైపు తెలంగాణ మంత్రి కేటిఆర్ కు ధీటుగా ప్రచారం చేశారు లోకేష్. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అని కూడా పంచ్ డైలాగులు విసిరారు. లోకేష్ నిర్వహించిన ప్రచారంలో రేవంత్ రెడ్డి నామమాత్రపు పాత్ర పోషించారు తప్ప అన్నీ తానై బాద్యతలను బుజాన వేసుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జిహెచ్ఎంసి ఎన్నికల వేళ రేవంత్ సైడ్ ఆర్టిస్టు మాత్రమే.
గవర్నర్ పదవి రాకపోయేసరికి అసహనంతో ఉన్న మోత్కుపల్లి రేవంత్ పై ఎడా పెడా నోరు పారేసుకున్నారని ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ శిబిరం అంటున్నది. అయితే అసహనంలో ఉండి రేవంత్ ను టార్గెట్ చేసి అన్నమాటలు రేవంత్ కు కాకుండా సూటిగా పార్టీ అధినేత కొడుకు, ఎపి మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ బాబుకు కసక్కున కుచ్చుకున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. మోత్కుపల్లి మాటలు లోకేష్ బాబును బాగా హర్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఎన్నికలు అన్న తర్వాత గెలుపోటములు సహజం కాబట్టి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పరుష వాఖ్యలు చేయడం సమంజసం కాదని లోకేష్ అనుచరులు సైతం అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అత్యంత సీనియర్ నేతగా చెప్పుకొంటున్న మోత్కుపల్లి ఇదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు భాగస్వామి కాలేకపోయారని కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెర మరుగైన ఓటుకు నోటు కేసును ప్రస్థావించడం కూడా మోత్కుపల్లికి తగదని కొందరు టిడిపి సీనియర్లు అంటున్నారు.
జిహెచ్ఎంసి, ఓటుకు నోటు వ్యవహారాలను మోత్కుపల్లి తెర మీదకు తేవడం ద్వారా లోకేష్ ను, చంద్రబాబును ఇద్దరినీ ఇరకాటంలో పడేశారని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. రేవంత్ మాటల కంటే ఎక్కువగా మోత్కుపల్లి మాటలే ఎపిలో టిడిపికి గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాయని రేవంత్ వర్గంలోని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
మరిన్ని కొత్త వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వెంకయ్య నాయుడి ఆరోగ్యం బాగుంది..