Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్: వరంగల్‌లో టీఆర్ఎస్ విజయ గర్జన సభ వాయిదా

 టీఆర్ఎస్ విజయ గర్జన సభకు ష్లానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో విజయ గర్జన సభను వాయిదా వేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. కరోనా నిబంధనల  మేరకు సభ నిర్వహించుకొనేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Local Body MLC Elections :TRS Vijaya Garjana Sabha Postponed in Warangal
Author
Warangal, First Published Nov 9, 2021, 4:28 PM IST

వరంగల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ నెల 29న  నిర్వహించాల్సిన టీఆర్ఎస్ విజయ గర్జన సభను ఆ పార్టీ వాయిదా వేసింది. అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది గులాబీ దళం. వాస్తవానికి ఈ నెల 15న  ఈ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సభను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఈ సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది.ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చినందున ఎవరైనా సభను నిర్వహించాలంటే కోవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రకటించారు. అంటే సభకు వెయ్యి మందికి మించకూడదు. కానీ వరంగల్ విజయ గర్జన సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ సభ నిర్వహించకుండా వాయిదా వేయడమే మేలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

also read:స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లుగా అధికారంలో ఉన్న  Trs సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  పలు పథకాలతో పాటు ప్రభుత్వ విజయాలను వివరించేందుకు గాను Vijaya Garjana Sabha నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. తొలుత ఈ సభను ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న Kcrనిరహార దీక్షకు దిగాడు. దీక్షా దివస్ ను పురస్కరించుకొని నవంబర్ 29వ తేదీన ఈ సభను నిర్వహించాలని warangal జిల్లాకు చెందిన నేతలు సీఎంను కోరారు. దీంతో ఈ నెల 15వ తేదీ నుండి 29వ తేదీకి సభను వాయిదా వేశారు.

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందని  ఈసీ ప్రకటించింది. వరంగల్ జిల్లాలో కూడ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.దీంతో వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ సభను వాయిదా వేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు టీఆర్ఎస్ కు నెలకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుండి ఒక్కొక్క స్థానానికి  కరీంనగర్  , మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10న ఎన్నికలు నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు  గత నెల 31న ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios