కుంతియాకు అవమానం: టీ నేతల 'ఆజాద్' ఉత్సాహం
కుంతియాకు షాకిచ్చిన టీ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలపై
ఆ పార్టీ ఇంఛార్జీ కుంతియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం
చేశారు. పార్టీ ఇంఛార్జీగా గులాంనబీ ఆజాద్ కు స్వాగతం
అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే కాకుండా
బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని
వ్యక్తం చేశారు. తనను అవమానపర్చారని ఆయన పార్టీ
నేతల తీరుపై మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా కుంతియా ఉన్నాడు.
అయితే ఇటీవల కాలంలో గులాం నబీ ఆజాద్ ను తెలంగాణ
ఇంఛార్జీగా నియమించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ
విషయమై సోషల్ మీడియాలో ఆజాద్ కు స్వాగతం అంటూ
కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టింగులు పెట్టారు,
ఆజాద్ కు స్వాగతమంటూ బ్యానర్లు ఏర్పాటు చేయడంపై
కుంతియా తీవ్రంగా రగిలిపోయారు. శుక్రవారం నాడు
హైద్రాబాద్ గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఈ
విషయమై పార్టీ నేతలను కుంతియా నిలదీశారు.
పార్టీ ఇంఛార్జీ మార్పు విషయమై అధిష్టానం నుండి నిర్ణయం
రాలేదన్నారు.పార్టీ అధికారికంగా ప్రకటన చేయకముందే
నేతలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు తనను తీవ్రంగా
అవమానపర్చారని ఆయన చెప్పారు.
రెండో విడత బస్సు యాత్ర... రాహుల్ రాక
రంజాన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి
బస్సు యాత్రకు సిద్దంకానుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ
నాయకులు రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు. ఈ
యాత్రలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొంటారని
కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో సభను
ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే
ఒక్క సభ కాకుండా వీలైనన్నీ ఎక్కువ సభలను జరిగేలా
చూడాలని కొందరు నేతలు ఈ సమావేశంలో సూచించారు.
అయితే కనీసం మూడు సభలను జరిగేలా పార్టీ నేతలు ప్లాన్
చేస్తున్నారు.
ఓయూ విద్యార్ధులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలను
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ యాత్రలో మరోసారి
కలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. తాము
అధికారంలోకి వస్తే ఏ రకమైన పాలనను అందిస్తామనే
విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు ఈ యాత్రలో
వివరించే అవకాశం ఉంది.