కెటిఆర్ కు ఏమైనా చెప్పాలనుందా...
కెటిఆర్ కు ఫిర్యాదులు అందాలంటే సరైన మార్గం @KTRTRS
తెలంగాణా మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను కలుసుకోవడం చాలా కష్టం. మూడు కీలకమయిన శాఖలు చూస్తున్న ఆయన ఒక చోట నిలకడగా ఉండటం కష్టం. అయితే, ప్రజలూ తెలివైన వాళ్లే. ఆయన కంటపడేందుకు, ఆయనకేదయినా చెప్పేందుకు మార్గం కనిపెట్టారు. ట్విట్టర్ హాండిల్ @KTRTRS అనేది ఇపుడు ఆయన అడ్రసు అని అందరికి తెలిసిపోయింది.
దీనితో రామారావు ట్విట్టర్ అకౌంట్ @ktrtrs ఒక గ్రీవెన్స్ రిడ్రెస్ సెల్ అయింది.
జిహెచ్ ఎంసి, హెచ్ ఎం డిఎ, ఇతర మునిసిపాలిటీల పరిధిలో పుట్టుకొచ్చిన అనేక అక్రమాల వివరాలను ఆయన దృష్టికి తెస్తూ చర్యలు తీసుకోవాలని చాలా మంది ప్రజలు @KTRTRS కు విజ్ఞప్తులు పంపిస్తున్నారు. ఆయన వారందరికి స్పందిస్తూ చర్యలు తీసుకునేందుకు అధికారులకు అదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాపితంగా మునిసిపల్ పరిధిలో లెక్క కు మించి అక్రమ కట్టడాలున్నాయని, అవన్నీ కూడా అధికారులకు తెలియకుండా జరగలేదనే విషయాన్ని ఈ ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి.
కెటిఆర్ మీద హైదరాబాద్ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో జిహెచ్ ఎంసి ఎన్నికలు స్పష్టంచేస్తాయి. ఆయన ప్రచార తీరుతో ప్రజలు కన్విన్స్ అయ్యారని వేరే చెపాల్సిన అవసరం లేదు. ఇపుడు ఆయనకు వస్తున్న ఫిర్యాదుల వెల్లువ కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తుంది.
నేక్నాంపూర్ పంచాయతీలో జరిగిన కట్టాడల మీద ఈ రోజు ఒక ఫిర్యాదు అందింది. లే అవుట్ 7676/MP2/1999 ఫైనల్ పర్మిషన్స్ ను సమీక్షించాలని @manojirtt అనే వ్యక్తి కెటిఆర్ ను కోరారు. కొన్ని ఫోటోలు పంపిస్తూ ఈ బిల్డింగ్ లో నివాసముంటున్నవారు ప్రమాదం అంచుల్లో ఉన్నారని ఆయన పెర్కొన్నారు. కెటిఆర్ స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
ఇదే విధంగా షేక్ జియా @shaikzia చండ్రుగొండ మండలం కేంద్రంలోని దుస్థితి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సామాన్యుడిఇల్లు, అధికార పార్టీ నాయకుడి ఇల్లు పోటోలు పంపించి తేడా చూడమన్నారు.ఈ విషయం మీద దర్యాప్తు చేయాలని వెంటనే మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ను ఆదేశించారు.
సమస్యలను చర్చించేందుకు, సమాచారం చేరవేసేందుకు ట్విట్టర్ ను వాడుకుంటున్న మంత్రులలో కెటిఆర్ అగ్రశ్రేణి లో ఉంటారు. ఆయన ఇంతవరకు 1417 ట్వీట్లు చేశారు. 2.12 లక్షల మంది అనుచరులున్నారు. ఈ పిర్యాదులేమవుతాయో చూడాలి.