తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నారంటే…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్ లో ఉండటం రాష్ట్రానికే అవమానకరమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ సీఎం పేరును చార్జ్ షీట్ లో చేరిందని... నిజంగా ఆయనకు నీతి, నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాల కోసం నాయకులను రేవంత్ రెడ్డి ప్రలోబాలకు గురిచేసాడని ఈడి బయటపెట్టిందని కేటీఆర్ అన్నారు.
కర్ణాటకలో ఇదే బిజెపి అక్కడి డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ను విమర్శిస్తుంది... కానీ ఇక్కడ సీఎం తప్పుచేసినా పల్లెత్తిమాట అనడంలేదని కేటీఆర్ అన్నారు. ఇది చాలదా కాంగ్రెస్, బిజెపి మధ్య బంధాన్ని బయటపెట్టడానికి అని కేటీఆర్ పేర్కొన్నారు. స్కాంలు చేస్తున్న రేవంత్ సర్కార్ ను ఎందుకు కాపాడుతున్నారో మోడీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు.
గతంలో రేవంత్ రెడ్డి ఎన్నో తప్పులు చేసాడు... ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనకు బుద్ధి రాలేదంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 2015 ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డిని బ్యాగ్ మాన్ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేసారు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు సీటుకు రూట్ కుంభకోణాన్ని బైటపెట్టిందన్నారు. గతంలో రేవంత్ రూ.50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు... ఇది నిజమని తాజాగా ఈడీ చార్జిషీట్ ఆధారాలతో తేల్చిందన్నారు కేటీఆర్.
యంగ్ ఇండియా సంస్థకు ఎవరు డబ్బులు ఇచ్చారు? ఏ పొజిషన్ అమ్ముకున్నారు? అన్న వివరాలను ఈడి చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలో మారిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా ఢిల్లీ కాంగ్రెస్ కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నాడని అన్నారు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి కేవలం ఎమ్మెల్యేనే... కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తప్పుచేసి యావద్దేశం ముందు రాష్ట్ర పరువు తీసాడని కేటీఆర్ అన్నారు.
గతంలో యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండగా హౌసింగ్ స్కామ్ లో ఆయన ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిజాయితీ, నైతికత ఉంటే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలి... లేదంటే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం స్పందించి ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేసారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారన్నారు. చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకోవడం కేసుల నుంచి తప్పించాలని వేడుకోవడం.. బయటికి వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొట్టడం ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రేవంత్ చేసేదన్నారు. ఒక్క ఇటుక పేర్చకుండానే, ఒక కొత్త ప్రాజెక్టులు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క హామీని అమలు చేయకుండానే… లక్షా 80 వేల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘటన రేవంత్ దే అన్నారు. ఈ డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయో ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. .
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అనఫిషియల్ బాసులు అని అన్నారు. ఈ ముగ్గురు బాస్ లను ప్రసన్నం చేసుకోవడానికే రేవంత్ 44 సార్లు ఢిల్లీ పోయాడని కేటీఆర్ ఆరోపించారు. బిఆర్ఎస్ పై నిందలు... బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు... ఢిల్లీ బాస్ లకు వేలకోట్ల చందాలు... సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి చేసింది ఇదేనని కేటీఆర్ ఎద్దేవా చేసారు.