శ్రీశైలం రిజర్వాయర్ రూల్ కర్వ్స్లో మార్పులకు తెలుగు రాష్ట్రాలు సుముఖత
కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ఆధ్వర్యంలోని రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్లో మార్పులు చేసేందుకు ఇరు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్లు రిజర్వాయర్ల పర్యవేక్షక కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ఆధ్వర్యంలో శనివారం రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఈ భేటీ హాజరయ్యారు. నాగార్జున సాగర్ రూల్ కర్వ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు తెలంగాణ ఈఎన్సీ. సీడబ్ల్యూసీ సూచనల ప్రకారమే నాగార్జున సాగర్ రూల్ కర్వ్పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారాయన. 50:50 నిష్పత్తిలో పవర్ షేరింగ్కు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. పవర్ హౌస్ల నిర్వహణ, వరద నీటి వినియోగంపైనా కమిటీ చర్చించింది.
ALso Read:కేఆర్ఎంబీపై సుప్రీంలో ఏపీ పిటిషన్: తెలంగాణ,కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
మరోవైపు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షక కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్లో మార్పులు చేసేందుకు ఇరు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అయితే నాగార్జున సాగర్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదన్నారు. కేంద్ర జలసంఘం సూచనల మేరకు సాగర్ రూల్ కర్వ్స్పై నిర్ణయం తీసుకుంటామని పిళ్లై వెల్లడించారు. మిగుల జలాల విషయానికి సంబంధించి ప్రాజెక్ట్లు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు కోరాయని ఆయన పేర్కొన్నారు.