‘కొండా దంపతులను ఛీకొడుతున్నారు’
గరం గరం
వరంగల్ జిల్లాలో డైనమిక్ లీడర్స్ గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ, కొండా మురళి కి అధికార టిఆర్ఎస్ పార్టీలో చిన్నగా పొగ పెడుతున్న వాతావరణం కనబడుతున్నది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ, కొండా మురళిలను జనాలు ఛీ కొడుతున్నారని శాయంపేట ఎంపీపీ బాసని రమాదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాయంపేట ఎమ్మెల్యేగా 10 ఏళ్లు ఉన్న సురేఖ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుండటంతో... ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వీరు భావిస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారని... ప్రజలందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని కితాబిచ్చారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులను ఎవరూ నమ్మడం లేదని రమాదేవి అన్నారు.
కొండా దంపతుల మీద రమాదేవి వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రమాదేవి సొంతంగానే ఇలా మాట్లాడారా? లేక పై ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చనీయాంశమైంది.