టీడీపీతో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై అధిష్టానం పునరాలోచించాలని సూచించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు లేదని అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు.
హైదరాబాద్: మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై అధిష్టానం పునరాలోచించాలని సూచించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు లేదని అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.
టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి వివరిస్తానని స్పష్టం చేశారు. మహాకూటమిలోని పక్షాలను కేవలం పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కోమటిరెడ్డి సూచించారు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు. అంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలకు కేసీఆర్ ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
అటు టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటుపై ఇంత వరకు ఎక్కడా చర్చించలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టిక్కెట్ల కేటాయింపు, సీట్ల సర్ధుబాటు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు, సీట్ల సర్ధుబాటు అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.