కిషన్ రెడ్డి ప్రతి విషయంలోనూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు - మంత్రి సత్యవతి రాథోడ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా విషయాల్లో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టబోమని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ మాలోత్ కవిత తో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని, అది గిరిజనుల హక్కు అని చెప్పారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టం లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
అయితే తాజా ప్రకటన కిషన్ రెడ్డి చేసిందా లేక కేంద్ర ప్రభుత్వ వైఖరా అని స్పష్టం చేయాలని తెలిపారు. ఎన్నో ఆందోళనల తర్వాత బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని హామీ వచ్చిందని తెలిపారు. 2006 లో రక్షణ స్టీల్స్ కు బయ్యారం గనులు కేటాయిస్తే నిరసనలు వ్యక్తం అయ్యాయని, దీంతో అప్పటి ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేసుకుందని చెప్పారు.
కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణ పై పిడుగు పాటు లాంటిదని అన్నారు. ఆయన ప్రతీ అంశంలో అవగాహన లేకుండా మాట్లాతారని విమర్శించారు. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన ఉత్సవ విగ్రహంగా మారారని, కేంద్ర మంత్రి పదవి అలంకార ప్రాయంగా తయారయ్యిందని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలకు తమ సొంత పనుల పై ఉన్న శ్రద్ధ తెలంగాణ కు మంచి చేయడంలో లేదని మంత్రి అన్నారు. ఏపీలో గిరిజన విశ్వ విద్యాలయం పని చేస్తోందని, కానీ తెలంగాణ మాత్రం కేంద్ర మీన మేషాలు లెక్క పెడుతోందని ఆరోపించారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కి అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పిందని తెలిపారు. దాదాపు వంద నుంచి నూట యాబై ఏళ్లకు సరిపోయే ఉక్కు నిల్వలు ఉన్నాయని అన్నారు.
అనంరతం ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బీజేపీ కి గిరిజనులంటే గిట్టదని ఆరోపించారు. ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టబోమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు. ఆయన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు పర్యాటకుల మాదిరిగా వచ్చిపోతున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు.
ఆ నటులు రీల్ ఫిల్మ్ స్టార్స్.. కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్: రామ్ గోపాల్ వర్మ
అనంతరం ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ లో బీజేపీ నేతల మాటలు ఘనం, చేతలు శూన్యమని అన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ కు బీజేపీ ఒక్క మేలైనా చేశారా అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు ఎన్నో సార్లు వచ్చారని, కానీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలకు అక్కసు, ద్వేషం పెరిగిపోతున్నాయని అన్నారు. బయ్యారంలో అన్ని వసతులు ఉన్నాయని, కానీ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని అన్నారు. ఎలాంటి అభివృద్ధీ చేయని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని, ఓట్లర్లు అమాయకులు కారని అన్నారు. వెంటనే ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.