రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వస్తే మమ్మల్ని నిందించొద్దు.. అధికార పార్టీకి బీజేపీ చీఫ్ వార్నింగ్
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై.. పోలీసులపై ఫైర్ అయ్యారు. అధికారంలోని డీఎంకే పార్టీనీ హెచ్చరించారు. బీజేపీ క్యాడర్ పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ క్యాడర్తో దురుసుగా వ్యవహరించిన పోలీసు అధికారులపై డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటే.. అందుకు మాపై నిందలు వేయవద్దు. రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్ రాకుంటే అందుకు మేం బాధ్యులం కాదు అని అన్నారు.
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై అధికార పార్టీ డీఎంకేకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని.. లేదంటే వారినే మార్చేయాల్సి ఉంటుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందుకు తమను నిందించవద్దని పేర్కొన్నారు. కోయంబత్తూర్లో ఇటీవలే బీజేపీ నిరసనలు చేయగా.. పోలీసులు వారి పై కఠినంగా వ్యవహరించినట్టు ఆయన ఆరోపణలు చేశారు.
‘మమ్మల్ని టచ్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే అందుకు మమ్మల్ని బాధ్యులుగా తీసుకోరాదు. బీజేపీ క్యాడర్తో దురుసుగా వ్యవహరించిన పోలీసు అధికారులపై డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటే.. అందుకు మాపై నిందలు వేయవద్దు. రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్ రాకుంటే అందుకు మేం బాధ్యులం కాదు. ప్రతి రోజు పోలీసు యూనిఫామ్ వేసుకునేటప్పుడు ఏడిస్తే.. అందుకు మమ్మల్ని బాధ్యులుగా ఎంచరాదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
99 శాతం పోలీసులు నిజాయితీగలవారని, మంచి స్వభావం కలగవారని, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలని వారి అంతరాత్మను చంపుకోరని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై తెలిపారు. అవసరమైతే వారిని గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసినా.. నిజాయితీ వైపే నిలబడతారని పేర్కొన్నారు. కానీ, కొందరు ఇలా లేరని, అలాంటి వారు మరికొన్ని రోజులు ఓపిక పట్టాలని హెచ్చరించారు.
‘నేను ఇంతకు ముందు ఎన్నడూ ఇలా అనలేదు. 2024 పార్లమెంటు ఎన్నికలతోపాటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. అందుకు తాము బాధ్యులం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘మీ అంతటా మీరే మారకుంటే.. మిమ్మల్ని మార్చేయాల్సి ఉంటుంది’ అని డీఎంకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం నివాసాన్ని బీజేపీ క్యాడర్ ముట్టడి చేసే రోజులు మరెంతో దూరంలో లేవని పేర్కొన్నారు.