Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు. కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Kishan Reddy: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు. "రోడ్డుమీద ఎండ్లబండి పోతుంటే.. దాని కింద ఒక కుక్క వచ్చిందట.. ఆ కుక్క అనుకుందట ఎండ్లబండిని నేనే మోస్తున్నా.. నేనే నడిపిస్తున్నా.. ఈ భారం అంతా నా మీదే ఉందని అనుకుందట.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని" కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కులగణన చేపడుతున్నట్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రెడిట్ మొత్తం తమ నాయకుడు రాహుల్ గాంధీకే దక్కుతుందని అన్నారు. కుల గణన విషయంలో కేంద్రం తమ సలహాలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో కులగణన జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. మండల్ కమిషన్ నివేదికను కూడా అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టారు" అని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో బీసీలకు సమగ్ర న్యాయం చేయాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (భాజపా) కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు.
2011 జనగణనలో కులగణన చేర్చాలన్న డిమాండ్కు మద్దతుగా అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. కులగణన జరిపితే బీసీల సామాజిక, ఆర్థిక స్థితి వెల్లడవుతుంది. వెనుకబడి ఉన్న వర్గాల గుర్తింపుతో ప్రత్యేక పథకాలు రూపొందించవచ్చన్నారు. కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తమ విజయంగా కులగణన అంశాన్ని ప్రస్తావిస్తున్నా, గత 60 ఏళ్లలో ఎందుకు చేపట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి భయంతో తీసుకున్న నిర్ణయం కాదనీ, బీజేపీ నిజమైన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నందునే ఈ దిశగా ముందడుగు వేసిందని ఆయన స్పష్టం చేశారు.
ముస్లింలను బీసీల కోటాలో చేర్చడం ద్వారా అసలు బీసీలకు అన్యాయం చేయడం కాంగ్రెస్ పని. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వారు చేపట్టిన కులగణన అసలు సరైనది కాదని ఘాటు విమర్శలు చేశారు.