భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలకు దూరం ?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలంతా నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారంతా భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.
![Kishan Reddy, BJP MLAs who visited Goddess Bhagyalakshmi.. Far from assembly meetings?..ISR Kishan Reddy, BJP MLAs who visited Goddess Bhagyalakshmi.. Far from assembly meetings?..ISR](https://static-ai.asianetnews.com/images/01hh6dxpqwv0af0qpvnksag0nf/bjp-mlas-bagyalakshmi-temple-jpg_363x203xt.jpg)
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో శనివారం ఉదయం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారందరినీ కిషన్ రెడ్డి సత్కరించారు. నేడు తెలంగాణ నూతన శాసన సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
నేడు కొలువుదీరనున్న తెలంగాణ కొత్త అసెంబ్లీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు..
అనంతరం కిషన్ రెడ్డితో పాటు కొత్త ఎమ్మెల్యేలంతా చార్మినార్ దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఐఎంఐం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఈ విషయంలో శుక్రవారం సాయంత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన వైఖరిని స్పష్టం చేశారు.
అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేస్తే తాను అసెంబ్లీలో శనివారం ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పారు. అలాగే తమ ఎమ్మెల్యేలెరూ ప్రమాణ స్వీకారం చేయరని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా ? వెళ్లరా ? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది.