తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా వుంటామన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్ధతు వుంటుందన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తరహా కార్యక్రమాలను కేరళలోనూ అమలు చేస్తామన్నారు. జాతికి ఈ సభ దిశానిర్దేశం చేయాలని.. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై వుందని విజయన్ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్న ఆయన.. రాష్ట్రాల సమ్మేళనమే దేశమన్నారు. ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకూడదని, భావసారూప్యత కలిసిని పార్టీలతో బీఆర్ఎస్ కలిసి రావడం శుభపరిణామం అన్నారు. కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ నడుం బిగించారని పినరయి విజయన్ పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also REad: ప్రగతి భవన్ కు ముగ్గురు సీఎంలు, మాజీ సీఎం, జాతీయ నేతలు... సాదరస్వాగతం పలికిన కేసీఆర్ (ఫోటోలు)

గవర్నర్ల వ్యవస్థను స్వార్ధానికి వాడుకుంటున్నారని.. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే హిందీని బలవంతంగా మన మీద రుద్దుతున్నారని పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సంస్కరణల పేరుతో అనైతిక విధానాలను ఆచరిస్తోందని సీఎం ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడిందన్న ఆయన.. మోడీ కార్పోరేట్లకు తొత్తుగా మారారని ఆయన ఫైర్ అయ్యారు. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తున్నారని.. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆయన దుయ్యబట్టారు.