శనివారం నాడు ప్రధానితో సమావేశమయ్యాక నోట్ల రద్దుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు ప్రకటిస్తారా???
సూపర్ స్టార్ రజనీ కాంత్ మద్దతు తర్వాత నోట్ల రద్దు మీద మరొక కొండంత అండ ప్రధాని మోదీకి శనివారం నాడు లభిస్తుందని భారతీయ జనతా పార్టీ ధీమాతో ఉంది. దీనితో కష్టాలలో ఉన్న ప్రధానికి పెద్ద ఊరట అవుతుందని బిజెపి భావిస్తున్నది.
ఈ అండ తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుంచి లభిస్తుందని పార్టీ నాయకత్వం ఆశిస్తున్నది. శనివారం నాడు ప్రధానితో సమావేశమయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ నోట్ల రద్దుకు మద్దుతు తెలుపుతారని, అదే సమయంలో ప్రజల కష్టాలు తీరేందుకు కొన్ని సూచలన చేస్తారని బిజెపి వర్గాలు ’ఎషియానెట్’ కు తెలిపాయి.
ఈ మేరకు బిజెపి నాయకత్వానికి , టిఆర్ ఎస్ నాయకత్వానికి సంప్రదింపులు సాగాయని , ఫలితాలు ప్రధాని మోదీకి అనుకూలంగా ఉన్నాయని ఈ వర్గాలు చెప్పాయి. టిఆర్ ఎస్ ఎన్డీయే భాగస్వామి కానప్పటికీ ప్రతిపక్షంతో గొంతు కలపకుండా చేయగలిగామని ఈ వర్గాలు చెప్పాయి.
సభలో హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి ఎంపిలకు ఫోన్ చేసి చెప్పడం తొలివిజయమని, ప్రధాని సమావేశమయ్యేందుకు కెసిఆర్ ఢిళ్లీ వెళ్లాలనుకోవడం రెండో విజయమని చెబుతూ, శనివారం నాడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాని నోట్ల రద్దు చర్య మీద ఒక స్పష్టమయిన ప్రకటన చేస్తారని ఈ వర్గాలు చెప్పాయి.ఆ ప్రకటన కేంద్రానికి మద్దతు నిస్తూ ఉంటుందని ఆయన ఈ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
నల్లధనంపై కేంద్రప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఆహ్వానించదగిన పరిణామమేనని రాష్ట్ర సర్కారు ఇప్పటికే ప్రకటించిన విషయం చెబుతూ కెసిఆర్ ప్రధాని మోదీ చర్యకు వ్యతిరేకం కాదని, కాకపోతే, రాష్ట్రానికి, ప్రజలకు వస్తున్న ఇబ్బందులను విస్మరించరాదనే సూచన ఇవ్వవచ్చని ఈ వర్గాలు అన్నాయి.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద బహిరంగంగా తెలంగాణా ముఖ్యమంత్రి మాట్లాడనే లేదు. ఆయన గవర్నర్ తో సమావేశం కావడం, లేదా ఆయన అధికారులతో సమీక్షలు జరపడం, అక్కడ చర్చకు వచ్చిన వివరాలను బట్టి ముఖ్యమంత్రి ఈ చర్య మీద కినుక వహించారని అర్థమవుతుంది.రాష్ట్రానికి దెబ్బ తగిలిందని భావిస్తూ , కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు రాత ప్రకటనలు వెలువడ్డాయి.
అందుకే కేసిఆర్ మౌనం వీడి తన వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నోట్ల రద్దు సమస్య కోట్ల మంది ని బజారు కీడ్చినా కేసీఆర్ ఎందుకు దీనిపై మౌనంగా వుంటున్నారో ప్రజలకు చెప్పాలని పిసిసి అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కారణంగా తెలంగాణాలో ఏడుగురు చనిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు శనివారం నాడు సమాధానం దొరుక వచ్చు.
ఇది ఇలా ఉంటే, రాష్ట్ర ఖజానాపై చూపిన ప్రభావం గురించి, సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మోదీతో శనివారం సమావేశమవుతారు.
