కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్ట్పై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు రాజకీయ నాయకులను విచారించడం ప్రారంభించింది.
తెలంగాణలో భారీ ఎత్తున చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యత, డిజైన్, ఖర్చులపై అనేక అనుమానాలు వెలువడడంతో కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది.
ఇప్పటికే హాజరైన పలువురు అధికారులు
ఈ విచారణలో భాగంగా ఇప్పటికే నీటిపారుదల, ఆర్థిక, పే అండ్ ఎకౌంట్స్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, నిర్మాణ పనులు చేపట్టిన సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. వారు ఇచ్చిన వివరాల ప్రకారం, అన్నీ నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తీసుకున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు నోటీసులు
ఈ నేపథ్యంలో కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంది హరీశ్ రావుకి విచారణ కోసం సమన్లు జారీ చేసింది. వీరిలో కేసీఆర్ను జూన్ 5న, జూన్ 6న హరీశ్ రావును, జూన్ 9న ఈటల రాజేందర్ను విచారణకు హాజరుకావాలని తెలిపింది.
తేదీ మార్చమని కేసీఆర్ అభ్యర్థన
అయితే, జూన్ 5న విచారణకు హాజరుకాలేనని, బదులుగా జూన్ 11న రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా, కమిషన్ ఆ అభ్యర్థనను అంగీకరించింది. కేసీఆర్ జూన్ 11న కమిషన్ విచారణలో పాల్గొనబోతున్నారు. దీంతో ఆ రోజు ఏం జరగనుందన్న చర్చ మొదలైంది.
ఖండించిన బీఆర్ఎస్
కేసీఆర్కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ ప్రేరిత చర్యగా అభివర్ణిస్తూ, ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నం అని మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ప్రాజెక్టుపై ఈ స్థాయిలో విచారణ జరపడం అభ్యంతరకరమని విమర్శిస్తున్నారు.