ఎన్నికల వేళ రైతుకు దండాలు... ఎన్నికల తర్వాత అదే రైతుకు అరదండాలు

మూడేళ్ల టీఆర్ఎస్ పాలన లో తెలంగాణకు ఏం ఓరిగింది...?

రైతుల ఆత్మహత్యలు ఆగలేదు... నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు... నీరు పారలలేదు.. కన్నీరు ఆగలేదు.. కానీ, గులాబీ పంట మాత్రం పండుతోంది... ఖాకీ వనం మాత్రం పచ్చధనంతో వెల్లివిరిస్తోంది.

నయాం ముఠాతో అంటకాగిన పోలీసులకు ప్రమోషన్లు వస్తున్నాయి... న్యాయం అడిగిన రైతులకు బేడీలు పడుతున్నాయి.

ఎన్నికల వేళ రైతులకు దండాలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే రైతులకు పోలీసులతో అరదండాలు వేయించింది. రాజద్రోహం పేరుతో తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.

లక్ష ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్లో ఆశలు రేపి అధికారంలోకి రాగానే వారిపై పోలీసులను ఉసిగొల్పింది.

ఉద్యమ నేపథ్యంతోనే పుట్టిన పార్ట అధికారంలోకి రాగానే ఉద్యమించిన వారి తలలను ఖాకీల లాఠీలతో పగలగొట్టించింది.

ఇలా అధికార పార్టీ పోలీసుల అండతో బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తుంది. తన ప్రతి అడుగులో అండగా నిలబడుతున్న పోలీసులకు భారీగా నజరానాలు ప్రకటిస్తుంది.

ఇటీవల ఖమ్మంలో మిర్చి పంటకు గిట్టు బాటు ధర రాక అక్కడి రైతన్నలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

కడపుమండిన అన్నదాతలు మిర్చియార్డును ధ్వంసం చేస్తే వారిపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించింది. కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా వారిపై రాజద్రోహం కేసులు పెట్టింది. పోలీసులు వారిని ఉగ్రవాదుల్లా బేడీలేసి తీసుకవెళ్తే కిమ్మనకుండా ఉండిపోయింది.

మద్దతు ధర అడిగిన రైతుకు వట్టిచేతులు చూపించిన కేసీఆర్ సర్కారు తన పాలనకు ప్రతిపక్షణం అండగా నిలబడుతున్న పోలీసులపై మాత్రం వరాల జల్లు కురిపిస్తుంది.

ఏసీ కార్లు, అద్దాల మేడలతో పోలీసుస్టేషన్ లను తీర్చుదిద్దుతోంది. పోలీసుల పేరుతోనే ఓట్లు అడిగి గెలిచిన ఏకైక సర్కారు తమదే అంటూ ఎలుగెత్తిచాటుతోంది.

నిన్న హైదరాబాద్ లో జరిగిన పోలీసుమీట్ లో అయితే సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసులను ఆకాశానికి ఎత్తారు.

రైతులకు బేడీలేసునందుకా... ఉద్యమకారుల తలలు పగలగొట్టినందుకా... సివిల్ డ్రెస్సులలో వచ్చి ధర్నా చౌక్ లో ఉద్యమించినందుకా... మరింకెందుకో తెలియదు కానీ వారికి అక్కడికక్కడే రూ. 500 కోట్ల నజరానా ప్రకటించారు.

ఖాకీతో గులాబీకి ఉన్న ఈ ప్రేమకథ ఇక్కడితో ఆగుతుందా ఇంకా బాహుబలి కలెక్షన్లను మించిపోతుందా చూడాలి...