అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్
గ్యాంగ్ స్టర్ నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంతో తెలుసా... అక్షరాల రూ. 143 కోట్లు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలంగాణ అసెంబ్లీ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
మొత్తంగా 27 హత్య కేసుల్లో నయీం పాత్రను పోలీసులు గుర్తించారని, మరో 25 కేసుల్లో అతడి ముఠా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారని చెప్పారు.
సోమవారం మూడోరోజు నయీం వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీన నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిపారు.
నయీం కేసు దర్యాప్తునకు సిట్ను నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 174 కేసులు నమోదయ్యాయని, 741 మంది సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారని తెలిపారు.
రాష్ట్రంలో నయీం ముఠాకు సంబంధించిన స్థావరాలలో పోలీసులు సోదాలు చేశారన్నారు. మొత్తం 2.95 కోట్ల నగదు, 21 కార్లు, 21 తుపాకులు, 26 బైకులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
నయీం బంధువుల పేరు మీద ఉన్న దాదాపు 1015 ఎకరాల భూమిని, లక్షా 67వేల చదరపు గజాల విస్తీర్ణం గల ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు.
నయీం కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశారని, త్వరలో మరో 15 చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
