యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు
యాదగిరిగుట్ట (యాదాద్రి) ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా తెలంగాణ చరిత్రతో పాటు కేసీఆర్ చరిత్రను కూడ రాతి స్థంబాలపై చెక్కారు.
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో రాతి స్థంబాలపై కేసీఆర్ చిత్రాలను చెక్కారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును కూడ కొన్ని రాతి శిలలపై చెక్కడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధునీకరిస్తున్నారు. ఆధునీకీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తిరుపతి తరహాలో పెద్ద ఎత్తున ఆలయాన్ని అభివృద్ది చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
సాధారణంగా ఆలయాల్లో ఉన్న రాతి స్థంబాలపై ఆలయ చరిత్రతో పాటు ఆనాటి శాసనాలు అప్పటి సంప్రదాయాలను చెక్కుతారు.రాతి స్థంబాలపై అబ్బురపరిచే శిల్పకళ కూడ చూసే ఉంటాం. ఈ రాతిస్థంబాలపై చెక్కిన కళాకృతులు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుపుతాయి.
రాతి స్థంబాలపై చెక్కిన బొమ్మలు, నాట్యరీతులు, కళా సంపద ఆధారంగా కూడ పాలనను కూడ చరిత్రకారులు చెబుతుంటారు.యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాతి స్థంబాలపై పాత చరిత్రతో పాటు పాటు సీఎం కేసీఆర్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడ చెక్కారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు, కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, తెలంగాణకు హరిత హరం వంటి చిత్రాలను కూడ రాతి స్థంబాలపై చెక్కారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలకు కూడ రాతి స్థంబాలపై చెక్కారు. బతుకమ్మతో పాటు ఇతరత్రా తెలంగాణ పండుగ రీతులను కూడ రాతి స్థంబాలపై చెక్కారు.అష్టభుజి ప్రాకార మండపాల, బాలపాద పిల్లర్లపై సీఎం కేసీఆర్ చిత్రాన్ని, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును చెక్కారు.
త్వరలోనే ఈ ఆలయ ప్రాంగణంలోనే భారీ ఎత్తున యాగం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యాగం నిర్వహణ సమయం నాటికి ఆలయంలో నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు.అయితే ఆలయంలోని రాతి స్థంబాలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును చిత్రించడం పై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.