దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతనే
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత పేరునే కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సోలిపేట రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లి నియోజకర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
"సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారు" అని కేసీఆర్ అన్నారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని అన్నారు.
"నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసం. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాం" అని కేసీఆర్ ప్రకటించారు.
దుబ్బాక టీకెట్ మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆశించిన విషయం తెలిసిందే. ఆయనను కాదని కేసీఆర్ సోలిపేట సుజాత పేరునే కేసీఆర్ ఖరారు చేశారు.