నిజామాబాద్ లోకసభ స్థానంలో ప్రస్తుత ఎంపీ కల్వకుంట్ల కవితను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కుమారుడు సిద్ధపడుతున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో ప్రస్తుత ఎంపీ కల్వకుంట్ల కవితను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కుమారుడు సిద్ధపడుతున్నారు. ఇది డి. శ్రీనివాస్ ను ఇరకాటంలో పెడుతుందని అంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అరవింద్ బిజెపి నుంచి నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద అభిమానిని అంటూ ఆయన బిజెపిలో చేరారు. 

వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో కవిత ఇప్పటికే తన కార్యకలపాలను పెంచారు. ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె అత్తారిల్లు నవీపేట మండలం పొతంగల్ లో ఉంది. దీంతో ఆమెకు నిజామాబాద్ లోకసభ స్థానంలో బంధువర్గం కూడా ఉంది. 

కవిత 2014లో నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఆరు టీఆర్ఎస్ గెలుచుకుంది. జగిత్యాలలో మాత్రం కాంగ్రెసు నేత టీ. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పై విజయం సాధించారు. ఆ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి కవిత విస్తృతంగా పనిచేస్తున్నారు 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు .నిజాం షుగర్ వంటి ప్రజా సమస్యలను కూడా లేవనెత్తుతున్నారు. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించారు