హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్షలు వాయిదా.. రేపటి నుంచి షెడ్యూల్ యథాతథం..
ఈ రోజు జరగనున్న పరీక్షను జేఎన్టీయూ హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి పరీక్షలు ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని వివరించింది. వాయిదా వేసిన పరీక్ష రీషెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రవాణా సహా ఇతర సదుపాయాలపై ప్రభావం పడింది. ఈ వర్షాల వల్లే జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) కీలక ప్రకటన చేసింది. ఈ రోజు(సోమవారం) నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని వివరించింది. ఈ రోజు జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ ఈ పరీక్ష నిర్వహణకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
జేఎన్టీయూహెచ్ అనుబంధ యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్న కాలేజీలను ఉద్దేశిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు ఉదయం ఓ ప్రకటన చేసింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీ ప్రిన్సిపాల్స్ విజ్ఞప్తుల మేరకు ఈ రోజు(27.09.2021) జరగాల్సిన బీటెక్, బీఫామ్, ఫామ్ డీ, ఫామ్ డీ(పీబీ) కోర్సుల పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణకు తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది. అయితే, ఈ వర్సిటీకి చెందిన రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది.
గులాబ్ తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న నాలుగైదు గంటల్లో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.