సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపి గెలిపించాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. 

హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని పోటీ పెట్టి గెలిపించాలని Jagga Reddy టీపీసీసీ చీఫ్ Revanth Reddy కి సవాల్ విసిరారు.

ఆదివారం నాడు సీనియర్ల సమావేశం ముగిసిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టానంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, రాహలు్ గాంధీలకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేయడానికి మీరెవరూ అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు. మంత్రి హరీష్ రావును తన కూతురు కోసం వి. హనుమంతరావు కలిశాడని జగ్గారెడ్డి చెప్పారు. ఇందులో తప్పేం ఉందన్నారు హనుమంతరావు కూతురు డాక్టర్ అని, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును వి. హనుమంతరావు కలవడాన్ని కూడా తప్పు బడితే ఎలా అన్నారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వాళ్లు కలవలేదా, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ వాళ్లు మంత్రులను కలవలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మా లాంటి నేతలు లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీలో అందరినీ కలుపుకు పోవాలని జగ్గారెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి భజనపరులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాడా అని ఆయన ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి ఒక్కడే గొప్ప నాయకుడే అయితే సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపి గెలిపించాలని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపిస్తే అతను కాంగ్రెస్ లో గొప్ప నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరం కాదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత షో చేస్తున్నాడన్నారు. తాను కూడా వ్యక్తిగత షో చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. 

ఫోకాజ్ ఇస్తే ఏమైతదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. షోకాజ్ ఇవ్వనివ్వాలని కోరారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే రేవంత్ రెడ్డి గురించి ప్రతి రోజూ మాట్లాడుతానని జగ్గారెడ్డి చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో హుజూాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 60 వేల ఓట్లు వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో పార్టీ అభ్యర్ధికి కేవలం 3 వేల ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి భజన పరులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నష్టపర్చాడన్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా పార్టీని ఇంకా నష్ట పరుస్తాడని జగ్గారెడ్డి చెప్పారు. వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. సంగారెడ్డిలో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు బరిలో ఉంటారన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి హీరో అన్నారు. తాను విజయం సాధిస్తే తాను హీరో అన్నారు. తాను, కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి పాలైతే మేమిద్దరం జీరోలమేనని చెప్పారు.