ఖాతా బుక్ సీఈవోను బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ కు వచ్చేయాలని కేటీఆర్ సూచించడంపై కర్ణాటక ఐటీ మంత్రి స్పందించారు. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఆయన అలా మాట్లాడకూడదని అన్నారు. మనం అందరం భారతీయులమని, మనం ఇతర దేశాలతో పోటీ పడాలని తెలిపారు.
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ కు వచ్చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించడం సరైంది కాదని కర్ణాటక ఉన్నత విద్య, ఐటీ మంత్రి సీఎన్ అశ్వత్నారయన్ అన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం తప్పని తెలిపారు. ఇలాంటి వైఖరి ఉండకూడదని తెలిపారు.
బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖాతాబుక్ వ్యవస్థాపకుడు, సీఈవో రవీశ్ నరేశ్ ట్వీట్ చేశాడు. ‘‘ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ లోని స్టార్టప్లు బిలియన్ డాలర్లను పన్నుల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. కానీ ఈ ప్రాంతంలో రోడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రతి రోజు విద్యుత్ కోతలూ ఉన్నాయి. స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా లేదు. నడవడానికి వీలు లేని విధంగా ఫుట్ పాత్లు ఉన్నాయి. భారత్లోని చాలా గ్రామీణ ప్రాంతాలు ఇక్కడి సిలికన్ వ్యాలీ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లాలంటే పీక్ ట్రాఫిక్ టైంలో మూడు గంటలు పడుతుంది ’’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఈ ట్వీట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రవీశ్ నరేశ్ కు ట్వీట్ కు సమాధానం ఇస్తూ బెంగళూరు నుంచి బ్యాగులు సర్దుకొని తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ కు వచ్చేయాలని సూచించారు. ‘‘ మాకు మెరుగైన భౌతిక సదుపాయాలు ఉన్నాయి. అదే స్థాయిలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. మా విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటి. నగరంలోకి వెళ్లడం, రావడం చాలా సులభంగా ఉంటుంది. ఎలాంటి ప్రయాస ఉండదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తమ ప్రభుత్వం ఐ త్రీ మంత్రాలను పాటిస్తోంది. ఒకటి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ ’’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ ఆహ్వానంపైనే కర్నాటక మంత్రి అశ్వత్నారయణ వ్యాఖ్యలు చేశారు. “ కేటీఆర్ ట్వీట్ సరిగా లేదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి వైఖరి ఉండకూడదు. ఒకరి కాళ్లు ఒకరు లాగేందుకు ప్రయత్నించడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదు. మనం భారతీయులం. మనం మొత్తం ప్రపంచంతో పోటీ పడాలి’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో చెప్పారు.
2023లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు భారతదేశంలో అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరిద్దారిస్తామని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు బదులిచ్చిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్పై కూడా మంత్రి అశ్వత్నారయణ స్పందించారు. కాంగ్రెస్ నేత కలలు కంటున్నాడని చెప్పారు. ‘‘ కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ఆయనకు ఎలాంటి విశ్వసనీయత ఉంది ? విముక్తి అంటే ఏమిటో ఆయనకు తెలియదు. వారు మంచి భవిష్యత్తును ఇవ్వలేరు. ” అని అన్నారు. అయితే కాంగ్రెస్ నేత ట్వీట్ కు మంత్రి కేటీఆర్ బదిలిస్తూ.. తనకు కర్ణాటక రాజకీయాల గురించి పెద్దగా తెలియదని అన్నారు. ఎవరు గెలుస్తారో కానీ సవాలును స్వీకరిస్తానని చెప్పారు. ఈ విషయంలో సోమవారం ట్విట్టర్ లో వారి మధ్య సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది.
