క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపు గడువు పెంచుకునేందుకు ఆన్ లైన్ లో కాల్ సెంటర్ నెంబర్ వెతికిన ఓ యువతి మోసగాళ్ల వలలో పడింది. వాళ్లు చెప్పినట్టు చేసి రూ.19 వేలు పోగొట్టుకుంది.  

ఈ మ‌ధ్య ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఫ‌లానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని మీ డెబిట్ కార్డు బ్లాక్ అయ్యింద‌ని, త‌మ‌కు ఆ కార్డు నెంబ‌ర్ చెబితే దానిని యాక్టివ్ చేస్తామ‌ని కాల్ చేసి అమ‌యాకుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డ‌బ్బుల కాజేయడం ఎక్కువవుతోంది. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామ‌ని చెబితే నిజ‌మే అనుకొని వారు అడిగిన వివ‌రాలు అన్నీ చెప్పి..డ‌బ్బులు పోయాక ల‌బోదిబోమంటున్నారు. ఈ విష‌యంలో పోలీసు కంప్లైంట్ ఇచ్చినా.. ఆ డ‌బ్బ‌లు తిరిగి రాబట్టుకోవ‌డం దాదాపు అసాధ్య‌మే అవుతోంది. ఇలా సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో నిర‌క్ష్య‌రాస్యులే ప‌డుతున్నార‌నుకుంటే పొర‌పాటే. పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివిన వారు కూడా ఈ మోసగాళ్ల చిక్కుల్లో ప‌డి డ‌బ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్‌లోని బాలాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. 

భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. ముంబైలో ఒకరికి నిర్థారణ, దేశంలో 26కి చేరిన కేసుల సంఖ్య

క‌స్ట‌మ‌ర్ నెంబ‌ర్ కోసం సెర్చ్ చేస్తే...
బాలాన‌గ‌ర్ కు చెందిన స‌య్య‌ద్‌ గుల్‌నార్ అనే యువ‌తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. త‌న క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపు తేదీ మార్చుకోవాల‌ని అనుకుంది. కానీ దాని కోసం బ్యాంక్‌కు వెళ్ల‌కుండా.. కాల్ సెంట‌ర్ ద్వారా స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకుందామ‌ని అనుకొంది. త‌న వ‌ద్ద బ్యాంక్ కు చెందిన అధికారిక కాల్ సెంట‌ర్ నెంబ‌ర్ లేక‌పోవ‌డంతో ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేసింది. అక్క‌డ బ్యాంకు కాల్ సెంట‌ర్ అని ఉన్న నెంబ‌ర్ తీసుకుంది. త‌రువాత ఆ నెంబ‌ర్‌కు కాల్ చేసింది. కానీ క‌ట్ అయ్యింది. కొంత స‌మ‌యం త‌రువాత అదే నెంబ‌ర్ నుంచి ఆ యువ‌తికి కాల్ వ‌చ్చింది. బ్యాంక్ కాల్ సెంట‌ర్ నుంచి మాట్లాడుతున్నానని ప‌రిచ‌యం చేసుకున్నాడు. దీంతో అత‌డి మాట‌లు న‌మ్మిన యువ‌తి త‌న స‌మ‌స్య‌ను అత‌డికి చెప్పింది. తన క్రెడిట్ కార్డ్ చెల్లించే డేట్ మార్చుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పింది. తాను సూచించిన విధంగా చేస్తే గ‌డువు తేదీ సుల‌భంగా పెంచుకోవ‌చ్చని తెలిపారు. ఆన్‌లైన్ లో ఎనీ డెస్క్ సెర్చి ఆ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించాడు. ఆ యువ‌తి ఆ కాల్ సెంట‌ర్ వ్య‌క్తి చెప్పిన విధంగా చేసింది. దీంతో అత‌డు చెప్పినట్టు చేస్తూ పోయింది. మొబైల్‌కు ఓటీపీ వ‌స్తే దానిని కూడా చెప్పింది. దీంతో ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి 19,740 రూపాయిల్ క‌ట్ అయ్యాయి. ఇదే విష‌యం బ్యాంక్ నుంచి మెసేజ్ రూపంలో రావ‌డంతో ఆ యువ‌తి కంగుతింది. వెంట‌నే ఆ నెంబ‌ర్ కు కాల్ చేసింది కాన్ క‌ల‌వ‌లేదు. మ‌రి కొంత స‌మ‌యం త‌రువాత వేరే నెంబ‌ర్ నుంచి ఆ నెంబ‌ర్ కు కాల్ చేసింది. తాను క‌ల‌కత్తా నుంచి మాట్లాడుతున్నాన‌ని అక్కడి నుంచి స‌మ‌ధానం రావ‌డంతో తాను మోసపోయాన‌ని ఆ యువ‌తి గ్ర‌హించింది. వెంట‌నే బాలాన‌గ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న మోస‌పోయిన విధానం మొత్తం వారికి వివ‌రించింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.