సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని తప్పు చేశారు.. టికెట్ ఇవ్వకుంటే కారు దిగుతా: తీగల కృష్ణారెడ్డి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అల్టిమేటం విధించారు. తనకు మహేశ్వరం స్థానం నుంచి టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్లో ఉంటానని చెప్పారు. లేని యెడల కారు దిగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు, సబితా ఇంధ్రారెడ్డిని పార్టీలోకి స్వీకరించి తప్పు చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మహేశ్వరం నుంచి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ మారుతానని స్పష్టం చేశారు. అంతేకాదు, పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డిని తీసుకుని తప్పు చేశారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి చేతిలోనే పరాజయం పాలయ్యారు.
సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి తీగల కృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉంటున్నారు. రాజకీయాల్లోనూ క్రియాశీలంగా కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలకూ చాలా వరకు దూరంగానే ఉంటున్నారు. తన సొంత సెగ్మెంట్లోనూ ఆయన పార్టీ పనుల్లో కనిపించడం లేదు. దీంతో ఆయన పార్టీ మారుతారా? అనే చర్చ జరిగింది.
తీగల కృష్ణారెడ్డి కోడలు అనితా రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా చేస్తున్నారు. మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి టికెట్ అడిగితే.. ఒకే కుటుంబానికి రెండు పదవులా? అని కొందరు దీర్ఘాలు తీస్తున్నారని తీగల చెబుతున్నారు. అయితే, తాను కూడా కేసీఆర్తో సమానంగా రాజకీయాల్లో ఉన్నానని, తానూ కేసీఆర్లాగే మరో పదవి కోసం ప్రయత్నిస్తే తప్పేంటీ? అంటూ ఎదురు ప్రశ్నించారు.
Also Read: జులై 13న చంద్రయాన్ 3 ప్రయోగం.. ప్రకటించిన ఇస్రో
ఓ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకోవడం పొరపాటని, తెలంగాణ ఉద్యమ సమయంలో హోం మంత్రిగా ఉన్న ఆమె ఎందర ఉద్యమకారులను జైలులో పెట్టిందని అన్నారు. ఉద్యమంలో పని చేసిన చాలా మంది పార్టీకి దూరం అవుతున్నారని వివరించారు. వారందరినీ దగ్గరకు తీసుకుని కలవాలని కోరారు. లేదంటే.. తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు.