ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు పులులను దూరంనుండి చూడాల్సిన పనిలేదు. హైదరాబాద్ కు వెళితే చాలు... తెల్ల పులుల ముఖంలో ముఖం పెట్టి చూడవచ్చు. నెహ్రూ జూపార్క్లో టైగర్ గ్లాస్ ఎన్క్లోజర్ అందుబాటులోకి వచ్చింది.
Hyderabad : తెలుగు ప్రజలకు అద్బుత అవకాశం. ఇకపై పులులను దగ్గరినుండి చూడాలంటే ఏ సఫారీకో, సరదాగా సెల్ఫీ దిగాలంటే ఏ విదేశాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కు వెళితే చాలు. హైదరాబాద్ జూపార్క్ లో టైగర్ గ్లాస్ ఎన్ క్లోజర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేసిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 'వంతార' ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ప్రధాని గ్లాస్ ఎన్ క్లోజర్ లో పులులు, సింహాలతో సరదాగా ఫోటో దిగారు... అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాంటి అనుభూతే ఇప్పుడు తెలుగు ప్రజలకు కూడా దక్కనుంది.
ఏ సఫారీకి వెళ్లినా, జూపార్కుకు వెళ్లినా పులులు, సింహాలను చాలా దూరంనుండి చూసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు వాటిని అత్యంత సమీపంనుండి చూసే ఛాన్స్ లభిస్తుంది. ఇప్పుడు కేవలం పులులు గ్లాస్ ఎన్ క్లోజర్ ను అందుబాటులోకి తెస్తున్నారు... దీనికి సందర్శకుల నుండి వచ్చే స్పందనను బట్టి సింహాలు, ఇతర జంతువుల ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జూ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ జూపార్క్ లో టన్నెల్ ఆక్వేరియం :
సందర్శకులకు మరింత మెరుగైన అనుభూతిని కల్పించేందుకు హైదరాబాద్ జూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే వన్యప్రాణుల గ్లాన్ ఎన్ క్లోజర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు జూపార్క్ లో భారీ టన్నెల్ ఆక్వేరియం ఏర్పాటుకు సిద్దమయ్యారు.
జూపార్క్ లోని ఎకరం స్థానంలో అన్నిరకాల సముద్ర జీవులతో అద్భుతమైన టన్నెల్ ఆక్వేరియం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసారు. ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) పద్దతిలో ఈ ఆక్వేరియం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జూకు సందర్శకుల సంఖ్య మరింత పెరగనుంది.
ఇక ఏవియరీ, 9డి వర్చువల్ డిజిటల్ ఎక్స్పియరెన్స్ సెంటర్ వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు జూ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సగటు సందర్శకుల సంఖ్య రోజుకు 30 వేలు ఉండగా ఇదికాస్త 50 వేలకు చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.